తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల భవితవ్యం తేల్చే జవాబుపత్రాల మూల్యాంకనం.. ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. నెల రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. వాల్యుయేషన్ కోసం ఇంటర్ బోర్డు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి లోపాలు లేకుండా మూల్యాంకనం ప్రక్రియ చేపట్టనున్నారు. మార్కుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత.. ఫలితాలను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 14 వేలమంది సుమారు 60 లక్షల జవాబుపత్రాలను దిద్దాల్సి ఉంటుంది.
2.సమాధాన పత్రాలను పలు స్థాయిల్లో పరిశీలిస్తారు. ఆ తర్వాతే మార్కులను ఖరారు చేస్తారు. రోజుకు ఒక్కో అధ్యాపకుడు 40 సమాధాన పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. వారిని అసిస్టెంట్ ఎగ్జామినర్ అంటారు.
3.పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలకు తగిన సమాధానాలను నిపుణులు మూల్యాంకన ప్రక్రియ కోసం పంపుతారు. వీటి ఆధారంగా అసిస్టెంట్ ఎగ్జామినర్ జవాబుపత్రాలను పరిశీలించి మార్కులు వేస్తారు. కొన్ని పరిమితుల మేరకు విచక్షణాధికారంతో మార్కులు వేయవచ్చు. తర్వాత ఆ జవాబుపత్రం చీఫ్ ఎగ్జామినర్కు వెళ్తుంది. వారు మార్కులను, మూల్యాంకన తీరును పరిశీలిస్తారు.
4.తర్వాతి దశలో జవాబుపత్రం సబ్జెక్టు నిపుణుల వద్దకు వెళ్తుంది. ఎక్కడైనా పొరపాటు ఉంటే నిపుణులు సరిచేస్తారు. ప్రతీ ప్రక్రియ, ప్రతీ మార్పును చీఫ్ ఎగ్జామినర్ రికార్డు చేస్తారు. ఇన్ని దశలు దాటిన తర్వాత మార్కులు బోర్డుకు వెళతాయి. మూల్యాంకన సమయంలో ఇచ్చిన కోడ్ను ఇంటర్ బోర్డ్లో డీకోడ్ చేస్తారు. ఆ విద్యార్థి మార్కులను ఆన్లైన్లో నమోదు చేస్తారు.
5.సాఫ్ట్వేర్పై ట్రయల్ రన్ చేస్తారు. కొందరు విద్యార్థుల మార్కులను నమోదు చేసి.. సాంకేతిక లోపాలేమైనా ఉన్నాయా.. అని మానవ వనరుల ద్వారా పరిశీలిస్తారు. ఇలా మొత్తం 4 రౌండ్లు ట్రయల్ జరుపుతారు. ఎలాంటి సమస్య లేకపోతే.. తుది దశ ఫలితాలను నమోదు చేస్తారు.
6.జవాబుపత్రాల మూల్యాంకనం ఇవాళ ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగుతుంది. మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. మూల్యాంకనం ప్రక్రియను ఈసారి ఆధునిక పద్ధతుల్లో చేపట్టబోతున్నారు. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయానికి ప్రతీ కేంద్రాన్ని అనుసంధానం చేస్తున్నారు.
7.ఈసారి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మూల్యాంకనం చేసే అధ్యాపకులు ఏ సమయంలో వస్తున్నారు.. ఎప్పుడు కేంద్రం నుంచి వెళ్తున్నారనే వివరాలను రికార్డు చేస్తారు.
8.ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేని అధ్యాపకులనే మూల్యాంకనం కోసం ఎంపిక చేయాలని.. జిల్లా అధికారులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఆదేశాలిచ్చింది.
9.ఫస్ట్, సెకెండ్ ఇయర్ కలిపి మొత్తం 9లక్షల 96వేల 971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. వీరందరి అన్ని సబ్జెక్టులు కలిపి సుమారు 60 లక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సిఉంది.
10.స్పాట్ వ్యాల్యుయేషన్ జరిగే 19 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శాస్త్రీయ పద్ధతిలో ఈసారి మూల్యాంకనం ఉండబోతోంది. ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సంబంధిత కథనం