TSRTC : టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్.. శ్రీవారిని దర్శించుకున్న 1.14 లక్షల మంది
TSRTC Balaji Darshan : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పోర్టల్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్కు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. తిరుమలను చాలామంది దర్శించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) పోర్టల్లో అందుబాటులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్కు భక్తుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే 'బాలాజీ దర్శన్'(Balaji Darshan) ప్యాకేజీ కింద 1.14 లక్షల మంది దర్శన టిక్కెట్లతో పాటు బస్సు టిక్కెట్లను బుక్ చేసుకున్నారు.
టీటీడీ(TTD) అధికారుల మద్దతుతో ఆర్టీసీ ఈ ఏడాది జూలైలో తన వెబ్సైట్ ( www.tsrtconline.in )లో రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్లను ప్రవేశపెట్టినప్పటి నుండి, చాలా మంది ప్రయాణికులు ప్రతిరోజూ ప్రత్యేక దర్శన టోకెన్లతో బస్సు టిక్కెట్లను బుక్ చేస్తున్నారు. ఆర్టీసీకి నిత్యం దాదాపు 1,000 ప్రత్యేక దర్శన టిక్కెట్లు ఇస్తారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మద్దతుతో టీఎస్ఆర్టీసీ(TSRTC) ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టీఎస్ఆర్టీసి బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు బస్సు టిక్కెట్తో పాటు రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టిక్కెట్లను అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.
తెలంగాణ(Telangana)లోని వివిధ ప్రాంతాల నుంచి గత ఎనిమిది నెలల్లో 1,14,565 మంది ప్రయాణికులను సురక్షితంగా తిరుమల(Tiruamala)కు తీసుకెళ్లి వారి గమ్యస్థానాలకు చేర్చారు. ఈ బస్సులకు కనీసం వారం రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. బస్ ప్యాకేజీ కోసం, www.tsrtconline.in ఆన్లైన్లో లాగిన్ చేయవచ్చు లేదా టిక్కెట్ బుకింగ్ కౌంటర్లను సందర్శించి కనీసం ఒక వారం ముందుగానే దాన్ని పొందవచ్చు.
'రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతి(Tirupati)కి టీఎస్ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. ప్రతిరోజు వెయ్యి మంది ప్రయాణికులకు రూ.300 శీఘ్ర దర్శన టికెట్లు ఇచ్చేందుకు అవకాశం ఉంది. భక్తులు దీనిని ఉపయోగించుకోవాలి.' టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ చెప్పారు.
సంబంధిత కథనం