WTC Final : WTC ఫైనల్లో ఆడాలంటే భారత్ ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి?
IND Vs Ban : రెండో టెస్టులో బంగ్లాదేశ్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా.. మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్స్ పరిస్థితి ఏంటని సహజంగానే అందరికీ ప్రశ్న వస్తోంది.
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను గెలుచుకుంది టీమ్ ఇండియా. వన్డే సిరీస్లో ఎదురైన ఘోర పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్) ఫైనల్లో స్థానాన్ని భారత్ మరింత బలోపేతం చేసుకుంది. రెండో టెస్టులో బంగ్లాదేశ్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమ్ఇండియా శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ రాణించడంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది.
ట్రెండింగ్ వార్తలు
ఈ సిరీస్లో ఒక్క ఓటమి ఎదురైనా.. భారత ఐసీసీ(ICC) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు కఠినతరం అయ్యేది. సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా గాయాల కారణంగా షాక్ తగిలినట్టైంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాకు విజయం అంత సులువు కాదు. అయితే కేఎల్ రాహుల్ సారథ్యంలో భారత్ బంగ్లాదేశ్లో టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది.
WTC పాయింట్ల జాబితాలో భారత్
ఈ విజయంతో భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల(WTC Points) పట్టికలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ ఏడాది 14 మ్యాచ్లు ఆడిన టీమిండియా(Team India) ఎనిమిది విజయాలు, నాలుగు ఓటములతో 99 పాయింట్లతో 58.93 విజయ శాతంతో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 13 మ్యాచ్ల్లో తొమ్మిది విజయాలు, ఒక ఓటమితో 120 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నంబర్ వన్గా నిలిచింది. కాగా దక్షిణాఫ్రికా 11 మ్యాచ్ల్లో ఆరు విజయాలు, ఐదు ఓటములతో 72 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
10 మ్యాచ్లు ఆడిన శ్రీలంక(Sri Lanka) ఐదు విజయాలు, నాలుగు ఓటములతో 64 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ 22 మ్యాచ్ల్లో 10 విజయాలు, ఎనిమిది ఓటములతో 124 పాయింట్లు సాధించింది.
టీమ్ ఇండియా ఫైనల్ ఆడనుందా?
ఈ విజయం తర్వాత టీమిండియా ఐసీసీ డబ్ల్యూసీటీ ఫైనల్(WTC Final)లో ఆడుతుందా లేదా అన్నదానిపై చర్చ నడుస్తోంది. బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్ను గెలుచుకున్న భారత్.. ఫైనల్స్లో ఆడే అవకాశాలను మరింత పటిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్స్లో తమ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. అయితే రెండో స్థానం కోసం భారత్కు దక్షిణాఫ్రికా నుంచి సవాలు ఎదురైంది. కాబట్టి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ను భారత్ కచ్చితంగా గెలవాలి. ఈ నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియా 4-0తో గెలిస్తే ఫైనల్ ఆడడం ఖాయం.
లేదా ఈ సిరీస్ను 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకున్నా ఫైనల్లోకి ప్రవేశించడం ఖాయంగా ఉంటుంది. అయితే ఇది కాకుండా సిరీస్ డ్రాగా ముగిసినా లేదా భారత్ సిరీస్ ఓడినా ఫైనల్ చేరడం అనుమానమే. భారత్కు పోటీగా ఉన్న దక్షిణాఫ్రికా(South Africa) కూడా మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొంతగడ్డపై భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ సిరీస్ ఫిబ్రవరి 9 నుంచి మెుదలుకానుంది. ఏం జరుగుతుందో వెయిట్ చేయాలి ఇక.