Jaffer about Chahal: మూడో టీ20లో చాహల్ తప్పకుండా ఉండాలి.. వసీం జాఫర్ స్పష్టం
Jaffer about Chahal: అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో భారత్ మూడో టీ20 ఆడనుంది. ఈ సందర్భంగా వసీం జాఫర్ తుది జట్టులో ఆడే ఆటగాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండో టీ20లో రాణించిన చాహల్ను మూడో మ్యాచ్లోనూ తీసుకోవాలని స్పష్టం చేశాడు.
Jaffer about Chahal: న్యూజిలాండ్తో నిర్ణయాత్మక మూడో టీ20 బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదికగా మారనుంది. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్ను 1-1తో సమం చేసింది. దీంతో మూడో టీ20 కీలకం కానుంది. తొలి టీ20లో పరాజయం చెందిన టీమిండియాను.. హార్దిక్ పాండ్య రెండో మ్యాచ్లో పుంజుకునేలా చేశాడు. యజువేంద్ర చాహల్ను తుది జట్టులోకి తీసుకుని ప్రత్యర్థిపై స్పిన్ ఆధిపత్యం చెలాయించేలా చేశాడు. దీంతో మూడో టీ20లోనూ చాహల్ను తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా స్పందించాడు.
ట్రెండింగ్ వార్తలు
"న్యూజిలాండ్తో మూడో మ్యాచ్లో యజువేంద్ర చాహల్ను తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మణికట్టు స్పిన్నర్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. నేను ఇంతకు ముందే చెప్పినట్లు ఉమ్రాన్ మాలిక్ టీ20 క్రికెట్లో ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఈ మ్యాచ్కు ఉమ్రాన్ కంటే చాహల్ బెటర్ ఆప్షన్. ఉమ్రాన్ మాలిక్ ఈ ఫార్మాట్లో రాణించాలంటే వైవిధ్యంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది." అని జాఫర్ స్పష్టం చేశాడు.
శుబ్మన్ గిల్ విఫలమవుతున్న తరుణంలో మూడో టీ20కి అతడి స్థానంలో పృథ్వీషాకి అవకాశమివ్వాల్సిందిగా జాఫర్ అభిప్రాయపడ్డాడు.
"భారత్ జట్టులో మార్పు తీసుకురావాలనుకంటే శుబ్మన్ గిల్ స్థానంలో పృథ్వీషాను ఆడించాలి. ఎందుకంటే పృథ్వీ మంచి ఫామ్లో ఉన్నాడు. అంతేకాకుండా టీ20 క్రికెట్కు అతడు బాగా సూటవుతాడు. కానీ రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ను నేను పెద్దగా పట్టించుకోదలచుకోలేదు." అని జాఫర్ తెలిపాడు.
న్యూజిలాండ్పై భారత్ వన్డే సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయగా.. టీ20 సిరీస్లో మాత్రం కివీస్ అంత సులభంగా పట్టు విడవడం లేదు. తొలి టీ20లో సునాయసంగా విజయం సాధించిన బ్లాక్ క్యాప్స్.. రెండో టీ20లోనూ 99 పరుగుల పరిమిత లక్ష్యాన్ని చివరి బంతి వరకు కాపాడుకుని తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. దీంతో టీ20 సిరీస్ 1-1తో సమమైంది. ఇంక చివరిదైన మూడో టీ20 అహ్మదబాద్ నరేంద్రమోదీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనుంది.
సంబంధిత కథనం