Virat Kohli: ఒంటరితనాన్ని నేనూ అనుభవించాను: విరాట్ కోహ్లి
Virat Kohli: కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన మునుపటి చరిష్మా కోల్పోయాడు. తాజాగా ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్న అతడు.. ఒంటరితనంపై మాట్లాడాడు.
న్యూఢిల్లీ: ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గురువారం (ఆగస్ట్ 18)తో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టి 14 ఏళ్లయింది. ఈ సందర్భంగా అతడు తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో కూడా షేర్ చేశాడు. అయితే తాజాగా మరో ఇంటర్వ్యూలో కింగ్ కోహ్లి తన మెంటల్ హెల్త్, కెరీర్లో తాను పడిన ఇబ్బందుల గురించి కూడా స్పందించాడు.
ట్రెండింగ్ వార్తలు
తన కెరీర్ మొత్తం మానసిక ఆరోగ్యంతో తాను పోరాడినట్లు విరాట్ చెప్పాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడిన కోహ్లి.. కెరీర్లోను తాను ఎదుర్కొన్న ఒత్తిడి తన మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిందని అన్నాడు. "నేను కూడా ఒంటరితనాన్ని అనుభవించాను. చుట్టూ నన్ను సపోర్ట్ చేసేవాళ్లు, ఇష్టపడే వాళ్లు ఉన్నా కూడా ఒంటరిగా ఫీలయ్యాను. నిజానికి చాలా మంది ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు" అని విరాట్ చెప్పాడు.
నిజంగా ఇది చాలా సీరియస్ విషయమని, ప్రతిసారీ మనం బలంగా ఉండి దాన్నుంచి బయటపడటానికి ప్రయత్నించినా.. అది మనపై పైచేయి సాధిస్తుందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. అథ్లెట్లు సరైన విశ్రాంతి తీసుకొని, తమపై ఉన్న ఒత్తిళ్ల నుంచి బయటపడాలని సూచించాడు. అలా చేయలేకపోతే మీరు కుంగిపోవడానికి పెద్దగా సమయం పట్టబోదని కోహ్లి అన్నాడు.
ఈ మధ్యే తాను 2014 ఇంగ్లండ్ టూర్లో విఫలమైన సమయంలో డిప్రెషన్తో బాధపడినట్లు కూడా విరాట్ వెల్లడించిన విషయం తెలిసిందే. రన్స్ చేయలేకపోతున్నామన్న విషయం తెలిసినప్పుడు ప్రపంచంలో తాను ఒంటిరినైపోయానన్న బాధ కలుగుతుందని అప్పట్లో కోహ్లి చెప్పాడు. ఐపీఎల్ తర్వాత ఒక్క ఇంగ్లండ్ టూర్లో మాత్రమే ఆడిన అతడు.. ఇప్పుడు ఆసియా కప్ టీమ్లోకి తిరిగి వచ్చాడు.
సంబంధిత కథనం