Kohli About his Captaincy: నాపై ఫెయిల్యూర్ కెప్టెన్ ముద్ర వేశారు.. అయినా బాధ లేదు.. కోహ్లీ స్పష్టం
Kohli About his Captaincy: టీమిండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ తన గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. తనపై ఫెయిల్యూర్ కెప్టెన్ ముద్ర వేశారని స్పష్టం చేశాడు. తన కెప్టెన్సీలో ఎన్నో మార్పులు వచ్చినందుకు గర్వంగా ఉందని తెలిపాడు.
Kohli About his Captaincy: టీమిండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అదిరిపోయే బ్యాటింగ్ ప్రదర్శనతో అరుదైన ఘనతలను అందుకున్నాడు. పరుగులు చేయడమే కాకుండా తన యాటిట్యూడ్తో అభిమానాన్ని సంపాదించాడు. భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడమే కాకుండా టీమ్ను అగ్రస్థానంలో నిలిపాడు. అయితే ఎన్ని గౌరవాలను అందుకున్నప్పటికీ కోహ్లీని చాలా మంది ఫెయిల్యూర్ కెప్టెన్గా కొంతమంది చూస్తుంటారు. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే తెలిపాడు. తనపై ఫెయిల్యూర్ కెప్టెన్ ముద్ర వేశారని, అయితే తన నాయకత్వంలో జట్టు ఆటీతీరులో పెను మార్పులకు దోహదపడ్డానని కోహ్లీ అన్నాడు.
ట్రెండింగ్ వార్తలు
"గెలవడం కోసం టోర్నమెంట్లు ఆడతాం. నేను 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్కు కెప్టెన్గా ఉన్నాను. ఆ తర్వాత 2021లో జరిగిన టెస్టు ఛాంపియన్షిప్, టీ20 ప్రపంచకప్కు కూడా సారథ్యం వహించాను. నాలుగు ఐసీసీ టోర్నీల తర్వాత నాపై ఈ ముద్ర వేశారు. అయితే నేను ఎప్పుడూ ఈ కోణంలో నన్ను నేను అంచనా వేసుకోను. మేం జట్టుగా ఏం సాధించామో అదే చూస్తాం. మా ఆటతీరులో వచ్చిన పెనుమార్పులు నాకు గర్వకారణం" అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.
"ఓ టోర్నమెంట్ నిర్దిష్టకాలానికి జరుగుతుంది. కానీ ఆటతీరులో మార్పు అనేది సుదీర్ఘ కాలం పాటు జరుగుతుంది. అలా జరగాలంటే టోర్నమెంట్లో విజయం సాధించడానికి అవసరమయ్యే దానికంటే ఎక్కువ మంది కావాలి. నేను ఆటగాడిగా ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాను." అని కోహ్లీ స్పష్టం చేశాడు.
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2011 ప్రపంచకప్ను టీమిండియా కైవసం చేసుకుంది. ఈ జట్టులో కోహ్లీ కూడా సభ్యుడు. అతడు ఆ తర్వాత 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఈ రెండు టోర్నీల తర్వాత టీమిండియా ఇంత వరకు ఐసీసీ టోర్నీ గెలవలకేపోయింది.