T20 World Cup Tickets Sale: 5 లక్షలకుపైగా అమ్ముడైన టీ20 వరల్డ్‌కప్‌ టికెట్లు.. ఆ మ్యాచ్‌ హౌజ్‌ఫుల్‌-t20 world cup tickets sale in full swing as over 5 lakh tickets sold so far ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  T20 World Cup Tickets Sale In Full Swing As Over 5 Lakh Tickets Sold So Far

T20 World Cup Tickets Sale: 5 లక్షలకుపైగా అమ్ముడైన టీ20 వరల్డ్‌కప్‌ టికెట్లు.. ఆ మ్యాచ్‌ హౌజ్‌ఫుల్‌

Hari Prasad S HT Telugu
Sep 15, 2022 10:52 AM IST

T20 World Cup Tickets Sale: 5 లక్షలకుపైగా అమ్ముడయ్యాయి టీ20 వరల్డ్‌కప్‌ టికెట్లు. అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభం కాబోయే ఈ మెగా టోర్నీలో మ్యాచ్‌లను చూడటానికి ఫ్యాన్స ఎగబడుతున్నారు.

టీ20 వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనున్న ఎంసీజీ
టీ20 వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనున్న ఎంసీజీ (Twitter)

T20 World Cup Tickets Sale: టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఈ మ్యాచ్‌కు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. టోర్నీ ప్రారంభం కావడానికి మరో నెల రోజుల సమయం ఉండగా.. ఇప్పటికే 5 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడైపోయినట్లు ఆర్గనైజర్లు ప్రకటించారు. ఏకంగా 82 దేశాలకు చెందిన అభిమానులు ఈ టికెట్లను కొనుగోలు చేయడం ఇక్కడ మరో విశేషం.

ట్రెండింగ్ వార్తలు

అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకూ టీ20 వరల్డ్‌కప్‌ జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 16 నుంచి తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఈ మెగా టోర్నీకి ఇప్పటికే 8 టీమ్స్‌ నేరుగా క్వాలిఫై అవగా.. మరో నాలుగు టీమ్స్ ఈ రౌండ్‌ మ్యాచ్‌లలో ఆడి అర్హత సాధించనున్నాయి. ఇక సూపర్‌ 12 మ్యాచ్‌లు అక్టోబర్‌ 23న ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌తో ప్రారంభమవుతాయి.

టీ20 వరల్డ్‌కప్‌ ఇండోపాక్‌ మ్యాచ్‌ హౌజ్‌ఫుల్‌

ఇక ఈ ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ స్టేడియం కెపాసిటీ లక్ష కాగా.. ఆ టికెట్లన్నీ ఐదు నిమిషాల్లోనే అమ్ముడవడంతో మరో నాలుగు వేల టికెట్లను కేవలం నిల్చొని చూసే వీలు కల్పిస్తూ ప్రత్యేకంగా రిలీజ్‌ చేయడం విశేషం.

క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి టికెట్లు రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. ఈ టికెట్లు కూడా నిమిషాల్లోనే అమ్ముడైపోయాయంటే ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

టీ20 వరల్డ్‌కప్‌ టికెట్లు రీసేల్‌ చేసుకోవచ్చు

మొత్తంగా ఇప్పటికే 5 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడైపోగా.. అందులో పిల్లల టికెట్లే 85 వేలుగా ఉన్నాయి. ఇక మ్యాచ్‌లు చూడటానికి పిల్లలకైతే కనీస టికెట్‌ ధర 5 డాలర్లుగా, పెద్దలకైతే 20 డాలర్లుగా నిర్ణయించారు. ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకొని, చివరి నిమిషంలో వద్దనుకుంటే స్టేడియం దగ్గరే టికెట్లు రీసేల్‌ చేసుకునేందుకు వీలుగా అధికారికంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఐసీసీ వెల్లడించింది.

ఇక టికెట్లు అయిపోతే వెయిటింగ్‌ లిస్ట్‌లోనూ యాడ్‌ చేస్తున్నారు. ఒకవేళ అదనపు టికెట్లు అందుబాటులోకి వస్తే ఈ వెయిటింగ్‌ లిస్ట్‌ వాళ్లకు ఇవ్వనున్నారు. ఇక ఈ వరల్డ్‌కప్‌లో మూడు రోజులు రెండేసి మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటికి కూడా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌తో ఆడబోయే తొలి మ్యాచ్‌ కోసం పరిమిత సంఖ్య టికెట్లు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంచారు.

టికెట్ల అమ్మకాలపై ఐసీసీ ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పటికే 5 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడైనట్లు ఐసీసీ హెడ్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ క్రిస్‌ టెట్లీ వెల్లడించారు. ఈసారి మ్యాచ్‌లు చూసేవాళ్లలో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

WhatsApp channel