Ind vs SA | విశాఖపట్నంలో సౌతాఫ్రికాతో టీ20.. ఎప్పుడంటే?
ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ ఇండియాలో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఆ టీమ్ ఐదు టీ20 మ్యాచ్లు ఆడుతుంది.
ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్కు ఈ ఏడాది పెద్దగా రెస్ట్ దొరికేలా కనిపించడం లేదు. రెండు నెలల ఐపీఎల్ సీజన్ ముగియగానే మరో టీ20 సిరీస్కు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మెగా లీగ్ ముగిసిన వెంటనే సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ ఇండియా పర్యటనకు వస్తోంది. ఈ టూర్ వివరాలను బీసీసీఐ శనివారం ప్రకటించింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ టూర్లో మొత్తం ఐదు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ ఐదు టీ20లను ఐదు నగరాల్లో నిర్వహిస్తున్నారు. తొలి టీ20 ఢిల్లీలో జరగనుండగా.. మిగిలిన నాలుగు టీ20లు కటక్, విశాఖపట్నం, రాజ్కోట్, బెంగళూరులలో జరుగుతాయి. మే 29న ఐపీఎల్ ఫైనల్ జరగనుండగా.. సరిగ్గా పది రోజుల తర్వాత అంటే జూన్ 9న ఇండియా, సౌతాఫ్రికా తొలి టీ20 ఢిల్లీలో జరుగుతుంది.
ఆ తర్వాత జూన్ 12న కటక్లో రెండో మ్యాచ్, జూన్ 14న విశాఖపట్నంలో మూడో మ్యాచ్, జూన్ 17న రాజ్కోట్లో నాలుగో మ్యాచ్, జూన్ 19న బెంగళూరులో ఐదో మ్యాచ్ జరగనుంది. సౌతాఫ్రికా టీమ్ చివరిసారి 2020 మార్చిలో ఇండియా టూర్కు వచ్చింది. ఆ టూర్లో తొలి వన్డే దర్మశాలలో జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా రద్దయింది. ఇక తర్వాత కొవిడ్ మహమ్మారి కారణంగా ఆ సిరీస్ మొత్తాన్ని రద్దు చేశారు.
అంతకుముందు 2019, సెప్టెంబర్లో ఈ రెండు టీమ్స్ టీ20 సిరీస్లో తలపడ్డాయి. గతేడాది ఇండియా కూడా సౌతాఫ్రికా టూర్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ టూర్లో జరిగిన మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్లను కోల్పోయింది. ఇప్పుడు సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్లో ఆడే టీమ్లోని ప్లేయర్స్ అంతా ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్నారు. ఒక్క దీపక్ చహర్ మాత్రమే గాయం కారణంగా దూరమయ్యాడు. అటు సౌతాఫ్రికా టీమ్ నుంచి డీకాక్, మార్క్రమ్, మిల్లర్, ప్రిటోరియస్, రబాడా, వాండెర్ డుసెన్, ఎంగిడి, నోక్యాలాంటి ప్లేయర్స్ ఐపీఎల్లో ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో టీ20 వరల్డ్కప్ జరగనున్న నేపథ్యంలో ఇండియాకు ఈ సౌతాఫ్రికా సిరీస్ కీలకంగా మారనుంది.
టాపిక్