Ganguly on Hardik: హార్దిక్ను టెస్టు జట్టులోకి తిరిగి తీసుకోవాలి.. అతడో స్పెషలిస్ట్ క్రికెటర్.. గంగూలీ స్పష్టం
Ganguly on Hardik: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను తిరిగి టెస్టు జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ స్పష్టం చేశారు. అతడో స్పెషలిస్టు క్రికెటర్ అని తెలిపారు. హార్దిక్ ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలక ఆటగాడిగా ఉన్నాడు.
Ganguly on Hardik: హార్దిక్ పాండ్య ఇటీవల కాలంలో టీమిండియాలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తన ఆల్ రౌండ్ ప్రతిభతోనే కాకుండా కెప్టెన్గానూ జట్టును విజయాలను అందిస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ శర్మ లేనప్పుడు కెప్టెన్సీ బాధ్యతలను తీసుకుంటున్న హార్దిక్.. తన స్కిల్స్తో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనే ఆడుతున్న హార్దిక్ను టెస్టుల్లో మాత్రం తీసుకోవడం లేదు. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. హార్దిక్ను టెస్టు జట్టులోకి తీసుకోవాలని సూచించారు.
ట్రెండింగ్ వార్తలు
"టీ20ల్లో స్పెషలిస్టులు చాలా మంది ఉన్నారు. హార్దిక్ పాండ్య కూడా ఉన్నాడు. అయితే టెస్టు క్రికెట్లో అతడు మంచి అస్త్రమని నేను భావిస్తున్నాను. టెస్టు జట్టులోకి అతడు తిరిగి రావాలి. అప్పుడే అతడు గుర్తుండి పోతాడు. వన్డేలు, టీ20ల్లో అతడు స్పెషలిస్టు. కానీ చాలా ప్రత్యేకమైన క్రికెటర్. టెస్టుల్లోనూ ఉండాలి" అని గంగూలీ అన్నారు.
టీ20 క్రికెట్లో డబ్బు బాగా వస్తున్నప్పటికీ చాలా మంది ప్లేయర్లు ఇప్పటికీ అన్ని ఫార్మాట్ల్లో ఆడటానికి ఆసక్తి చూపుతున్నారని గంగూలీ తెలిపారు. "ఆటగాళ్లు ఎలా ఆడతారు అనేదానికి డబ్బుతో సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. ఆటలోకి డబ్బు రావడం చాలా గొప్ప విషయం. అది అలాగే ఉండాలి. కానీ మెజార్టీ ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లు బాగా ఆడాలని కోరుకుంటున్నారు. ఈ కుర్రాళ్లు ఆకలితో ఉన్నారిలా ఉండటం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది." అని దాదా స్పష్టం చేశారు.
రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్గా ఎవరుండాలనే అంశంపై గంగూలీ మాట్లాడారు. "ఐపీఎల్ మంచి బ్రీడింగ్ గ్రౌండ్. ఈ టోర్నీలో హార్దిక్ పాండ్య ఎంత చక్కగా సారథ్యం వహించాడో చూశాం. అతడు పొట్టి ఫార్మాట్లో కూడా భారత్కు కెప్టెన్గా ఉండటానికి ఇది ఒక కారణం. ఐపీఎల్ గెలుపు, ఓటములను విస్మరించరాదు. ఎందుకంటే ఇది చాలా కఠినమైన టోర్నీ" అని గంగూలీ అన్నారు.
హార్దిక్ పాండ్య చివరగా టెస్టు మ్యాచ్ 2018లో ఇంగ్లాండ్పై ఆడాడు. ఆ తర్వాత వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైన అతడు.. ఆ తర్వాత స్థానం కూడా కోల్పోయాడు. అయితే ఇటీవల కాలంలో అతడు తన ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో మళ్లీ టెస్టు క్రికెట్లో పునరాగమనం చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అతడిని తీసుకోవాలని అంటున్నారు.