Badminton Asia Championships : చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్.. ఆసియా బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్
Satwik Sairaj-Chirag Shetty : సుమారు యాభై రెండేళ్ల నిరీక్షణకు తెర దించారు సాత్విక్- చిరాగ్. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణ పతకాన్ని అందించారు.
దుబాయ్లో జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్(Asia Badminton Asia Championship)లో తెలుగు తేజం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ఫైనల్ మ్యాచ్లో మలేషియాకు చెందిన ఓంగ్ యెువ్ సిన్, టీయో యీ జంటను ఓడించి ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని(Gold Medal) సాధించారు.
సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj), చిరాగ్ శెట్టి(Chirag Shetty) ఓంగ్ యెువ్ సిన్, టీయో యీ యీతో జరిగిన ఫైనల్ పోరులో అద్భుత ప్రదర్శన చేశారు. తొలి గేమ్ను 16-21తో కోల్పోయిన భారత జోడీ తర్వాత బలంగా పుంజుకుంది. రెండో గేమ్ను 21-17తో, మూడో గేమ్ను 21-19తో గెలిచి చరిత్ర సృష్టించారు.
తొలి సెట్లో ఓడినా నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో ఆడారు. ఈ జోడీ ఎక్కడా డీలా పడకుండా గొప్పగా పోరాడి టైటిల్ సాధించింది. సాత్విక్-చిరాగ్ మెుదట వెనుకబడే ఉన్నారు. అందరూ ఈ సారీ టైటిల్ పోయినట్టే అనుకున్నారు. కానీ ఆత్మవిశ్వాసంతో దూకుడూగా ఆడి.. గోల్డ్ మెడల్ సాధించి.. చరిత్ర సృష్టించారు.
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్(Asia Badminton Championship) డబుల్స్ విభాగంలో భారత్కు ఇదే తొలి బంగారు పతకం. అంతకుముందు 1971లో జరిగిన ఈ టోర్నీలో దీప్ ఘోష్, రామన్ ఘోస్ సెమీ ఫైనల్స్కు చేరుకున్నారు. అయితే సెమీ ఫైనల్లో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అంతకుముందు 1965లో, ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి చెందిన దినేష్ ఖన్నా సింగిల్స్లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. అయితే డబుల్స్లో ఇప్పటి వరకు ఏ భారత జోడీ ఫైనల్ చేరలేదు. ఫైనల్లోకి అడుగుపెట్టిన తొలి జోడీగా సాత్విక్, చిరాగ్ ఇప్పుడు పతకంతో సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించడంతో, ఇద్దరు అథ్లెట్లను ప్రధాని మోదీ అభినందించారు. బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారత పురుషుల డబుల్స్ జోడీకి అభినందనలు. మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు అని ప్రధాని మోదీ(PM Modi) అభినందించారు.