Prithvi Shaw Selfie Controversy: సెల్ఫీ వివాదంలో పృథ్వీషాపై సప్నా గిల్ రివర్స్ కేసు.. అసభ్యంగా తాకాడని ఆరోపణ-sapna gill files case against cricketer prithvi shaw amid selfie controversy ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Prithvi Shaw Selfie Controversy: సెల్ఫీ వివాదంలో పృథ్వీషాపై సప్నా గిల్ రివర్స్ కేసు.. అసభ్యంగా తాకాడని ఆరోపణ

Prithvi Shaw Selfie Controversy: సెల్ఫీ వివాదంలో పృథ్వీషాపై సప్నా గిల్ రివర్స్ కేసు.. అసభ్యంగా తాకాడని ఆరోపణ

Prithvi Shaw Selfie Controversy: భారత క్రికెటర్ పృథ్వీషా సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సప్నా గిల్ అనే యూట్యూబర్ ఆమె స్నేహితులు పృథ్వీతో సెల్ఫీ కోసం అడుగ్గా.. అతడు నిరాకరించాడు. దీంతో పృథ్వీషా స్నేహితుడి కారును ధ్వంసం చేశారు. ఈ వివాదంలో సప్నా గిల్ కూడా తిరిగి పృథ్వీపై కేసు నమోదు చేసింది.

పృథ్వీషా (AFP)

Prithvi Shaw Selfie Controversy: టీమిండియా క్రికెటర్ పృథ్వీషా, ప్రముఖ యూట్యూబర్ సప్నా గిల్ మధ్య వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేదు. నాలుగు రోజుల క్రితం ముంబయిలోని ఓ హోటెల్‌కు వచ్చిన పృథ్వీషాతో సెల్ఫీ దిగేందుకు సప్నా గిల్ ఆమె స్నేహితులు ప్రయత్నించారు. మొదట ఒ సెల్ఫీ దిగేందుకు అనుమతించిన పృథ్వీషా వారు పదే పదే అడగడంతో నిరాకరించారు. దీంతో హోటెల్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా క్రికెటర్‌ను వెంబడించి అతడితో వాగ్వాదానికి దిగారని, తన స్నేహితుడి కారును ధ్వంసం చేశారని ఆరోపించాడు. దీంతో ముంబయి ఓషివారా పోలీసులు సప్నా గిల్ సహ 8 మందిని అరెస్టు చేశారు. తాజాగా బెయిల్‌పై బయటకు వచ్చిన సప్నా.. పృథ్వీషాపై తిరిగి కేసు నమోదు చేసింది.

ఐపీసీ సెక్షన్ 34(కావాలనే నేరం చేశారని), 120బీ(నేరపూరిత కుట్ర), 146(అల్లర్లు), 148(ఆయుధాలతో అల్లర్లు), 149(ప్రాసిక్యూషన్‌లో చట్టవిరుద్ధమైన నేరం), 323(స్వచ్ఛందంగా బాధించడం), 324(ఆయుధాలతో బాధించడం), 351(నేరశక్తులను ఉపయోగించడం), 354(దౌర్జన్యానికి దిగడం), 509(దౌర్జన్యానికి ఉసిగొలపడం) లాంటి సెక్షన్ల కింద పృథ్వీషాపై ఫిర్యాదు చేసింది.

సప్నాగిల్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15న ఓ క్లబ్‌కు వెళ్లానని, సదరు క్రికెటర్‌ను చూడగానే అతడు మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించిందని ఫిర్యాదులో తెలిపింది. తన స్నేహితుడు శోభిత్ ఠాకూర్ సెల్ఫీ కోసం పృథ్వీషాను సంప్రదించగా వాగ్వాదానికి దిగాడని, అతడు బలవంతంగా తన స్నేహితురాలి ఫోన్‌ను తీసుకుని నేలపై హింసాత్మకంగా విసిరి పాడు చేశాడని ఆరోపించింది. తను క్రికెట్‌ను అంతగా అభిమానించనని, అసలు పృథ్వీషా ఎవరో కూడా తనకు తెలియదని స్పష్టం చేసింది. కావాలనే అతడు, అతడి స్నేహితులు తమపై దాడి చేశారని, నేను వద్దని వారించినప్పటికీ తన మాటలను వినకుండా అనుచితంగా ప్రవర్తించారని స్పష్టం చేసింది. ఆ సమయంలో పృథ్వీ తనను అనుచితంగా తాకాడని, నెట్టాడని స్పష్టం చేసింది. అప్పుడు నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగానే అతడు అభ్యర్థించాడని, తన స్నేహితులు కూడా వద్దని చెప్పడంతో ఆ సమయంలో ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేసింది. కానీ పృథ్వీషా మాత్రం తనపై, తన స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపింది.

మరోవైపు పృథ్వీషా.. సప్నాగిల్‌పై దోపిడి కేసు పెట్టాడు. ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ.. "నేను 50 వేలు అడిగానని చెబుతున్నారు. ఈ రోజుల్లో 50 వేలు అంటే ఏంత? నేను రెండు రీళ్లు చేసి ఒక్క రోజులో అంత సంపాదించగలను. ఆరోపణ చేయాలంటే కనీసం కొంత స్థాయి అయినా ఉండాలి." అని సప్నా గిల్ తెలిపింది.

పృథ్వీషా స్నేహితుడు ఆశిష్ యాదవ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరి 17న సప్నా గిల్‌ను అరెస్టు చేశారు. ఈ అరెస్టు కారణంగానే తన ఫిర్యాదు చేయడం ఆలస్యమైందని ఆమె తెలిపింది. ఇదిలా ఉంటే ముంబయి ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో సప్నా ఫిర్యాదును ఇంకా ఎఫ్ఐఆర్‌గా మార్చలేదు.

టాపిక్