Sanju Samson Injured: సంజూ శాంసన్కూ గాయం.. రెండో టీ20కి డౌటే
Sanju Samson Injured: సంజూ శాంసన్కూ గాయమైంది. దీంతో శ్రీలంకతో జరగబోయే రెండో టీ20కి అతడు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఈ మ్యాచ్ గురువారం (జనవరి 5) జరగనుంది.
Sanju Samson Injured: టీమిండియాను గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. తాజాగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ కూడా గాయపడ్డాడు. దీంతో గురువారం (జనవరి 5) శ్రీలంకతో జరగబోయే రెండో టీ20కి అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ పుణెలో జరగనుండగా.. శాంసన్ ముంబైలోనే ఉండిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
తొలి టీ20 సందర్భంగా శాంసన్ మోకాలి గాయానికి గురయ్యాడు. మ్యాచ్ తర్వాత అతనికి స్కాన్లు నిర్వహించారు. వీటి ఫలితం కోసం అతడు ముంబైలోనే ఉండిపోగా.. మిగతా టీమంతా పుణె వెళ్లింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో 13వ ఓవర్లో సంజూ శాంసన్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్లో అతడు బ్యాట్తోనూ విఫలమయ్యాడు.
కేవలం 5 రన్స్ చేసి ధనంజయ డిసిల్వా బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయే ఔటయ్యాడు. టీమ్లో మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఉండటంతో సంజూ శాంసన్ ఫీల్డింగ్ చేశాడు. తొలి టీ20 మ్యాచ్లో ఇండియా కేవలం 2 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 160 రన్స్ చేయగలిగింది.
చివరి ఓవర్లో విజయం కోసం 13 పరుగులు అవసరం కాగా.. అక్షర్ పటేల్ 10 రన్స్ ఇచ్చాడు. ఓ సిక్స్ కొట్టిన చమిక కరుణరత్నె భయపెట్టినా.. చివరి మూడు బాల్స్ను కట్టుదిట్టంగా వేసిన అక్షర్.. ఇండియాను 2 పరుగులతో గెలిపించాడు. అతడు అంతకుముందు బ్యాటింగ్లోనూ 31 రన్స్ చేసి ఇండియన్ టీమ్ 162 రన్స్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
బౌలింగ్లో శివమ్ మావి 4 వికెట్లు తీశాడు. కెరీర్లో తాను ఆడిన తొలి టీ20 మ్యాచ్లోనే మావి రాణించాడు. మూడు టీ20ల సిరీస్లో ఇండియా 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్ గురువారం (జనవరి 5) పుణెలో జరగనుంది.
సంబంధిత కథనం