Rohit Sharma: డివిలియర్స్‌ వరల్డ్‌ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్‌ శర్మ-rohit sharma a century away from ab devilliers most away centuries record in odis ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rohit Sharma A Century Away From Ab Devilliers Most Away Centuries Record In Odis

Rohit Sharma: డివిలియర్స్‌ వరల్డ్‌ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్‌ శర్మ

Hari Prasad S HT Telugu
Jul 12, 2022 02:35 PM IST

Rohit Sharma: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతున్న సమయంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. సౌతాఫ్రికా గ్రేట్‌ ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉన్న రికార్డు అది.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (AP)

లండన్‌: ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్‌కు దూరమైన రోహిత్‌ శర్మ.. వచ్చీ రాగానే టీ20 సిరీస్‌ గెలిపించాడు. ఇక ఇప్పుడు వన్డే సిరీస్‌పై టీమిండియా కన్నేసింది. అదే సమయంలో రోహిత్‌ శర్మ కూడా ఓ వ్యక్తిగత రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇంగ్లండ్‌ గడ్డపై ఆడటాన్ని ఎంజాయ్‌ చేసే రోహిత్‌శర్మ.. రాబోయే మూడు వన్డేల్లో ఎప్పుడైనా ఆ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌ రోహిత్‌కు ఫేవరెట్‌. అందులోనూ ఇంగ్లండ్‌తో ఆడుతుంటే మరింత చెలరేగుతాడు. ఆ టీమ్‌పై మూడు ఫార్మాట్లలో కలిపి 44 సగటుతో అతడు రన్స్‌ చేశాడు. ఏడాది కాలంగా ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయని రోహిత్‌కు ఆ కరువు తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. తన ఫేవరెట్‌ ఫార్మాట్‌, తన ఫేవరెట్‌ ప్రత్యర్థిపైనే వరల్డ్‌ రికార్డు అందుకోవడానికి రోహిత్‌ ఆతృతగా ఉన్నాడు.

విదేశీ గడ్డపై వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు ఇప్పుడు రోహిత్‌ను ఊరిస్తోంది. ఇప్పటి వరకూ సౌతాఫ్రికా గ్రేట్‌ ఏబీ డివిలియర్స్‌తో కలిసి 7 సెంచరీలతో రోహిత్‌ టాప్‌లో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే వరల్డ్‌ రికార్డు అతని సొంతమవుతుంది. డివిలియర్స్‌, రోహితే కాదు.. సచిన్‌, సయీద్‌ అన్వర్‌ కూడా విదేశాల్లో వన్డేల్లో ఏడేసి సెంచరీలు చేశారు.

రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌ గడ్డపై వన్డేల్లో ఇప్పటి వరకూ ఏడు సెంచరీలు చేశాడు. డివిలియర్స్‌ ఇండియాలో, సచిన్‌ యూఏఈలో, సయీద్‌ అన్వర్‌ యూఏఈలో వన్డేల్లో ఏడేసి సెంచరీలు చేశారు. ఇక విదేశీ గడ్డపై కనీసం 1000 రన్స్‌ చేసిన వాళ్లలో అత్యధిక సగటు ఉన్న మూడో ప్లేయర్‌ రోహిత్‌ శర్మ. ఇంగ్లండ్‌లో రోహిత్‌ సగటు 66.8 కావడం విశేషం. తొలి రెండు స్థానాల్లో డివిలియర్స్‌ (ఇండియాలో 70.3), కేన్‌ విలియమ్సన్‌ (ఇంగ్లండ్‌లో 69.6) ఉన్నారు.

ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో చాలా రోజుల తర్వాత తన ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌ శిఖర్‌ ధావన్‌తో కలిసి రోహిత్‌ ఆడనున్నాడు. వన్డేల్లో సచిన్‌, గంగూలీ తర్వాత 5 వేల ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌షిప్‌ నెలకొల్పిన రెండో భారత ఓపెనింగ్‌ జోడీగా నిలవడానికి ఈ ఇద్దరూ కేవలం 6 పరుగుల దూరంలో ఉన్నారు. తొలి వన్డేలోనే ఈ రికార్డు బ్రేక్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం