Rohit Injured: రోహిత్ శర్మ వేలికి గాయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతాడా లేదా?
Rohit Injured: రోహిత్ శర్మ వేలికి గాయమైంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతాడా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ గాయం కాగానే అతడు ప్రాక్టీస్ సెషన్ నుంచి తప్పుకున్నాడు.
Rohit Injured: ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఒక రోజు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తన బొటన వేలికి గాయం చేసుకున్నాడు. దీంతో వెంటనే ముందు జాగ్రత్తగా అతడు ప్రాక్టీస్ నుంచి తప్పుకున్నాడు. మంగళవారం కెన్నింగ్టన్ ఓవల్లో ఆప్షనల్ ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ కు గాయమైంది.
ట్రెండింగ్ వార్తలు
గాయం తగిలిన వెంటనే రోహిత్ నెట్ సెషన్ నుంచి తప్పుకున్నా.. దీని తీవ్రత తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అతని ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. అయితే అతడు ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. ఆ సమయంలో రోహిత్ ఎలాంటి ఇబ్బంది పడినట్లు కనిపించలేదు. త్రోడౌన్స్ వేస్తున్న సమయంలో ఓ బంతి బలంగా అతని బొటనవేలికి తగిలింది.
గతేడాది విరాట్ కోహ్లి నుంచి కెప్టెన్సీ అందుకున్న తర్వాత రోహిత్ శర్మ లీడ్ చేస్తున్న తొలి ఐసీసీ ఫైనల్ ఇది. పదేళ్లుగా ఓ ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్న టీమిండియాతోపాటు కెప్టెన్ గా రోహిత్ కు ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ ఎంతో కీలకం కానుంది. కెప్టెన్సీ అందుకున్న తర్వాత ఆరు టెస్టులకు కెప్టెన్ గా ఉన్నాడు రోహిత్. అయితే ఆ మ్యాచ్ లన్నీ సొంతగడ్డపై ఆడినవే.
గతేడాది ఇంగ్లండ్ తో చివరి టెస్టుకు ముందు కొవిడ్ కారణంగా దూరం కావడంతో బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత బొటన వేలి గాయం కారణంగా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు కూడా అతడు దూరంగా ఉన్నాడు. 2021 ఇంగ్లండ్ టూర్లో ఇప్పుడు ఫైనల్ జరగబోయే ఓవల్లోనే రోహిత్ 127 పరుగులు చేశాడు. దీంతో ఈ ఫైనల్లో రోహిత్ ఆడటం టీమిండియాకు చాలా చాలా ముఖ్యం.
గతేడాది టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్.. టీమిండియాకు మరో ఐసీసీ ట్రోఫీ అందించడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. అతనికి డబ్ల్యూటీసీ ఫైనల్ రూపంలో అవకాశం వచ్చింది. మరి ఈ ఫైనల్లో అతడు ఏం మాయ చేస్తాడో చూడాలి.
సంబంధిత కథనం