Ramiz Raja on India: బీజేపీ మైండ్సెట్ వల్లే ఇండియా, పాకిస్థాన్ క్రికెట్కు ఇబ్బందులు: రమీజ్ రాజా
Ramiz Raja on India: బీజేపీ మైండ్సెట్ వల్లే ఇండియా, పాకిస్థాన్ క్రికెట్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు రమీజ్ రాజా అన్నారు. పాక్ తనకు తానుగా ఆదాయం సమకూర్చుకుంటే ఇండియా ఆధిపత్యాన్ని సవాలు చేయొచ్చని చెప్పారు.
Ramiz Raja on India: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పదవి నుంచి తప్పుకున్నా సరే ఇండియాపై మాటల దాడిని కొనసాగిస్తున్నారు పీసీబీ మాజీ బాస్ రమీజ్ రాజా. తాజాగా భారత్లోని అధికార పార్టీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఇండియాలో ప్రస్తుతం రాజ్యమేలుతున్న బీజేపీ మైండ్సెట్ వల్లే పాకిస్థాన్ క్రికెట్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు.
ట్రెండింగ్ వార్తలు
బుధవారం (జనవరి 11) గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ లాహోర్లో రమీజ్ మాట్లాడారు. ఈ సందర్భంగా క్రికెట్లో ఇండియా ఆధిపత్యంపై మరోసారి తనదైన విమర్శలు చేశారు. "దురదృష్టవశాత్తూ, ఇండియాలో బీజేపీ మైండ్సెట్ రాజ్యమేలుతోంది. నేను పీసీబీ ఛీఫ్గా ఉన్నప్పుడు ప్రకటించిన పీజేఎల్ అయినా లేదా పాకిస్థాన్ వుమెన్స్ లీగ్ అయినా మనం సొంతంగా డబ్బు సంపాదించుకునే ఆస్తులు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ నిధులపై ఆధారపడకుండా ఇలా సొంతంగా డబ్బు సమకూర్చుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం" అని రమీజ్ అన్నారు.
"ఐసీసీ ఆదాయ వనరుల్లో చాలా వరకూ ఇండియాలోనే క్రియేట్ అవుతున్నాయి. దీనివల్ల మనకు స్వేచ్ఛ లేకుండా పోతోంది. పాకిస్థాన్ను అణగదొక్కాలన్నదే ఇండియా మైండ్సెట్ అయితే మనం ఎటూ కాకుండా పోతాం" అని రమీజ్ చెప్పారు. ఐసీసీ పూర్తిగా డబ్బుకు లొంగకుండా ఉండేందుకు నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని తాను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బోర్డులను కోరినట్లు వెల్లడించారు.
"ఈ విషయంలో స్పష్టంగా నా ఉద్దేశమేంటో చెప్పాను. ఓ ఆసియా టోర్నీని నిర్వహించాలని ఏసీసీ పాకిస్థాన్కు బాధ్యతలు అప్పగించింది. కానీ ఇండియా సడెన్గా మేము పాకిస్థాన్ వెళ్లము.. టోర్నీని అక్కడి నుంచి తరలించాలని చెబితే.. మాకు కూడా వేరే మార్గాలు ఉన్నాయని మాత్రం నేను చెప్పాను" అని రమీజ్ అన్నారు.
ఇండియాపై ఆధిపత్యం చెలాయించి, పాకిస్థాన్ను ఓ బలమైన స్థానంలో ఉంచాలంటే కచ్చితంగా ఇండియాను ఓడించడం ఒక్కటే మార్గమని తాను కెప్టెన్ బాబర్ ఆజంతో చెప్పినట్లు రమీజ్ వెల్లడించారు. ఇండియాను క్రికెట్లో ఓడిస్తేనే పాకిస్థాన్ ఓ బలీయమైన శక్తిగా ఎదుగుతుందని తాను నమ్మినట్లు చెప్పారు.
సంబంధిత కథనం