World Cup: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమ్స్ సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19వ వరకు జరిగే ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు, ప్లానింగ్ చేసుకుంటున్నాయి. వరల్డ్ కప్లో న్యూజిలాండ్ కూడా ఓ హాట్ ఫేవరెట్గా ఉంది. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో దురదృష్టంతో ఓడిన కివీస్ టీం ఈసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. కాగా, ఈ ఏడాది వన్డే ప్రపంచప్ కోసం న్యూజిలాండ్.. భారత్కు చెందిన ఓ ఎనలిస్టును నియమించుకుంది. గతంలో రంజీల్లో ముంబైకు, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్కు పర్ఫార్మెన్స్ ఎనలిస్టుగా పని చేసిన సౌరభ్ వాకర్ను కివీస్ నియమించుకుంది.
ఆగస్టు 30వ తేదీ నుంచి ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్తో న్యూజిలాండ్ జట్టుతో చేరతాడు పర్ఫార్మెన్స్ ఎనలిస్ట్ సౌరభ్ వాకర్. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ కోసం ఇండియాలో పిచ్లు ఎలా ఉంటాయో, ఎలా సన్నద్ధమవ్వాలనే విషయాలపై న్యూజిలాండ్కు సాయం చేయనున్నాడు. వరల్డ్ కప్ కోసం టామ్ లాథన్ నేతృత్యంలోని కివీస్ టీమ్ సన్నద్ధం అయ్యేందుకు వాకర్ సహకరించనున్నాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్లో జరిగే ది హండ్రెడ్ లీగ్లో జాస్ బట్లర్ టీమ్ అయిన మాంచెస్టర్ ఒరిజినల్స్ టీమ్ కోసం పని చేస్తున్నాడు సౌరభ్ వాకర్. ఇప్పుడు న్యూజిలాండ్ జట్టులో చేరనున్నాడు.
“ఇండియాలో పిచ్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే నేను ఆ విషయంపై ఎక్కువ దృష్టి సారిస్తా. వ్యూహాలను రచించడంలో పిచ్ అంశం చాలా ముఖ్యం. న్యూజిలాండ్ టీమ్లో భాగం అవడం నాకు చాలా పెద్ద అవకాశం. అన్ని జట్లపై.. ముఖ్యంగా ఇండియాపై (ప్రపంకప్) ఎలా ఆడాలో నేను నా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నా. భారత ప్లేయర్లకు సంబంధించిన ప్రత్యేకమైన ఇన్పుట్లను నా నుంచి న్యూజిలాండ్ టీమ్ ఆశిస్తోంది. నేను ముంబై సీనియర్ టీమ్లో ఉన్నప్పుడు (ఎనలిస్టుగా) రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ సహా చాలా మందితో గతంలో పని చేశా. నా కెరీర్లో అతిపెద్ద టోర్నమెంట్కు నేను సన్నద్ధమవుతున్నా. న్యూజిలాండ్ హెడ్ కోచ్, ప్లేయర్లకు సహకారం అందిస్తా” అని వాకర్ కాడిఫ్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ముంబై రంజీ జట్టుకు గతంలో 8 సంవత్సరాల పాటు పర్ఫార్మెన్స్ ఎనలిస్టుగా పని చేశాడు వాకర్. ఆ తర్వాత ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొంతకాలం పని చేశాడు. 2021 ప్రపంచకప్ కోసం అఫ్గానిస్థాన్ టీమ్కు ఎనలిస్టుగా చేశాడు. ఇక ఇప్పుడు న్యూజిలాండ్ టీమ్లో అవకాశం దక్కించుకున్నాడు.