Kohli on 5th Wedding Anniversary: విరుష్క వివాహ బంధానికి ఐదేళ్లు.. కోహ్లీ హార్ట్ టచింగ్ పోస్ట్
Kohli on 5th Wedding Anniversary: విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ వివాహ బంధానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. 2017 డిసెంబరు 11న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. వీరికి 2021 జనవరి 11న అందమైన పాప కూడా పుట్టింది.
Kohli on 5th Wedding Anniversary: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆటతోనే కాదు.. మన రన్నింగ్ మెషిన తన ప్రవర్తన, వ్యక్తిగత జీవితంతోనూ అభిమానులను ప్రభావితం చేస్తుంటాడు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను వివాహం చేసుకున్న ఈ స్టార్ ఆటగాడు.. కెరీర్లో ఎన్నో మైలు రాళ్లను అందుకున్నాడు. అలాంటి కోహ్లీ తన జీవితంలో ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అనుష్కానే అని చెబుతున్నాడు. 2017 డిసెంబరు 11న వీరిద్దరూ వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ రోజు వీరు తమ ఐదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తాజాగా అనుష్కపై తన ప్రేమ గురించి మరోసారి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
ట్రెండింగ్ వార్తలు
శాశ్వతమైన ప్రయాణంలో 5 సంవత్సరాలు గడిచాయి. నేను నిన్ను పొందడం నా జన్మ ధన్యంగా భావిస్తున్నా. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. అంటూ విరాట్ కోహ్లీ తన ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టాడు. ఇందుకు అనుష్క శర్మ కూడా రిప్లయి ఇచ్చింది. "థ్యాంక్ గాడ్.. ఇంకా నువ్వు తిరిగి రుణం తీర్చుకుంటాననలేదు." అంటూ ఆమె తన స్పందనను తెలియజేసింది.
అనుష్క పోస్టును బట్టి చూస్తుంటే.. విరాట్ కోహ్లీ ఏదో పెట్టబోయి.. అది వద్దనుకుని ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. పేబ్యాక్ పోస్టు పెట్టాలని అనుష్క మాటల్లో తెలుస్తోంది. గతంలో అనుష్కతో తన బంధం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనుష్క తన జీవితంలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తిగా పేర్కొన్నాడు. "నా జీవితంలో అనుష్క చాలా ఎక్కువగా ప్రభావితం చేసింది. అది జీవితంలోనే కాదు గేమ్పై కూడా ఉంది. సరైన కారణాల వల్ల నేను మనిషిగా పూర్తిగా మారిపోయాను. సరైన మార్గంలో మెరుగుపడ్డాను." అని కోహ్లీ స్పష్టం చేశాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నారు. ఆ జట్టుతో శనివారం జరిగిన మూడో వన్డేలో అద్భుత శతకంతో రాణించాడు. ఫలితంగా కెరీర్లో 72వ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ తన తొలి సెంచరీనే డబుల్గా మలచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో భారత్ 227 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ.. అంతకుముందు రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలవ్వడంతో సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. డిసెంబరు 14 నుంచి బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్ జరగనుంది.
సంబంధిత కథనం