Kohli and Rahul Rested: ఇప్పుడే ఫామ్లోకి వచ్చారు.. అప్పుడే రెస్ట్ ఇస్తే ఎలా?
Kohli and Rahul Rested: ఇప్పుడే ఫామ్లోకి వచ్చారు.. అప్పుడే రెస్ట్ ఇస్తే ఎలా అంటూ టీమిండియా మేనేజ్మెంట్పై మండిపడుతున్నారు పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు. సౌతాఫ్రికాతో మూడో టీ20కి కోహ్లి, రాహుల్లకు విశ్రాంతిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Kohli and Rahul Rested: విరాట్ కోహ్లి చాలా రోజుల పాటు ఫామ్ కోసం తంటాలు పడి.. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాడు. కేఎల్ రాహుల్ గాయంతో చాలా రోజుల పాటు టీమ్కు దూరమై వచ్చాడు. అతడూ తన స్ట్రైక్రేట్, వైఫల్యాల విమర్శల నుంచి బయటపడి మునుపటి మెరుపులు మెరిపించే పనిలో ఉన్నాడు. అలాంటి ఈ ఇద్దరి క్రికెటర్లను సౌతాఫ్రికాతో జరగబోయే మూడో టీ20కి విశ్రాంతినివ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
ఇప్పుడే ఫామ్లోకి వస్తున్నారు.. అప్పుడే పక్కన పెడితే ఎలా అంటూ పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ బౌలర్ దొడ్డ గణేష్ కూడా టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ట్వీట్ చేశాడు. సౌతాఫ్రికాపై తొలి రెండు టీ20లు గెలిచిన ఇండియన్ టీమ్ సిరీస్ గెలవడంతో అంతగా ప్రాధాన్యత లేని మూడో టీ20 నుంచి ఈ ఇద్దరు కీలక ప్లేయర్స్కు విశ్రాంతినిచ్చారు.
దీంతో వీళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. మూడో టీ20 మంగళవారం (అక్టోబర్ 4) ఇండోర్లో జరగనుంది. గౌహతి టీ20లో కోహ్లి, రాహుల్ ఇద్దరూ మెరుపులు మెరిపించారు. వరల్డ్కప్కు ముందు ఈ ప్లేయర్స్ దూకుడు ఇలాగే కొనసాగాలని అభిమానులు ఆశిస్తున్న సమయంలో వాళ్లకు రెస్ట్ ఇవ్వడం మాజీలకు నచ్చడం లేదు. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ దొడ్డ గణేష్ ట్వీట్ చేశాడు.
"కేఎల్ రాహుల్ ఇప్పుడిప్పుడే తన రిథమ్ను అందుకున్నాడు. అతనితోపాటు కోహ్లికి మూడో టీ20కి విశ్రాంతి ఇచ్చారు. నాకు ఇది అర్థం కాలేదు. ఈ ఇద్దరూ చాలా కాలం పాటు టీమ్కు దూరంగా ఉండి ఇప్పుడిప్పుడే తిరిగి వస్తున్నారు. ఫామ్లో ఉన్నప్పుడు సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడి, రన్స్ చేయాలి. నేను నమ్మేది అయితే అదే" అని గణేష్ ట్వీట్ చేశాడు.
ఆసియాకప్లో విరాట్ కోహ్లి ఫామ్లోకి రాగా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్లలో దానిని కొనసాగించాడు. అటు రాహుల్ కూడా తన స్ట్రైక్రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడిప్పుడే మెరుపులు మెరిపిస్తున్నాడు. రెండో టీ20లో అతడు కేవలం 28 బాల్స్లో 57 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ టీమ్లో లేకపోవడంతో మూడో మ్యాచ్కు శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా తుది జట్టులోకి రానున్నారు.