Ishan About his Double ton: సూర్యకుమార్ను ఫాలో అయ్యాను.. డబుల్ సెంచరీ కొట్టేశాను.. ఇషాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ishan About his Double ton: టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్.. తన డబుల్ సెంచరీ వెనకున్న వ్యూహాన్ని తెలియజేశాడు. ఈ ద్విశతకం సాధించేందుకు తను టీ20 వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ అనుసరించిన విధానాన్ని ఫాలో అయినట్లు తెలిపాడు.
Ishan About his Double ton: టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్.. శనివారం నాడు బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో అద్భుతమే చేశాడు. తొలి సెంచరీనే డబుల్గా మలచి అరుదైన ఘనతను సాధించాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా 126 బంతుల్లోనే ద్విశతకం చేసిన ఆటగాడిగా రికార్డు దక్కించుకున్నాడు. దీంతో సర్వత్రా అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఇన్నింగ్స్తో వన్డే జట్టులో అతడు తన స్థానాన్ని సుస్థిరమైనట్లేనని తెలుస్తోంది. తాజాగా తన ప్రదర్శన గురించి కొన్ని ఆసక్తిర విషయాలను తెలియజేశాడు ఇషాన్. తను డబుల్ సెంచరీ చేయడానికి టీ20ల్లో సూర్యకుమార్ అవలంభించిన విధానాన్ని అనుసరించానని పేర్కొన్నాడు. శుబ్మన్ గిల్తో జరిగిన చిట్ చాట్లో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ట్రెండింగ్ వార్తలు
రెండో వన్డే జరిగిన వేదికలో నెట్ ప్రాక్టీస్ చేయడానికి వికెట్ సరిగ్గా అనుకూలించలేదు. అందుకే మూడో వన్డేకు మ్యాచ్ రోజు ఉదయాన్ని నెట్ ప్రాక్టీస్ చేశాను. ఇతర బ్యాటర్లు కూడా చాలా సేపు నెట్స్లో ప్రాక్టీస్ చేశారు. అది మాకు బాగా కలిసొచ్చింది. సూర్య భాయ్ కూడా టీ20 వరల్డ్ కప్ సమయంలో ఇలాగే మ్యాచ్ రోజు ఉదయాన్ని నెట్ ప్రాక్టీస్ చేసేవాడు. అతడు అప్పుడు బాగా ఆడాడు. నేను కూడా అదే విధానాన్ని అనుసరించాను. ఫలితంగా డబుల్ సెంచరీ చేయగలిగాను. అని ఇషాన్ కిషన్ స్పష్టం చేశాడు.
రెండో వన్డేలో రోహిత్ శర్మ బొటన వేలుకు గాయం కావడంతో.. అతడు మూడో వన్డేకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో ఓపెనర్గా ఇషాన్ కిషన్ను తీసుకున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకున్నాడు ఇషాన్. చేసిన తొలి సెంచరీనే డబుల్గా మలచి అద్భుత ప్రదర్శన చేశాడు. 126 బంతుల్లో 210 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా 113 పరుగులతో అద్భుత సెంచరీని నమోదు చేశాడు. ఇషాన్-విరాట్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 290 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగో భారత ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్గా చూస్తే ఏడో ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇషాన్ 131 బంతుల్లోనే 210 పరుగులు చేశాడు. ఇందులో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. వేగంగా ఆడే ప్రయత్నంలో తస్కిన్ అహ్మద్ వేసిన 36వ ఓవర్లో ఇషాన్ కిషన్ ఔటయ్యాడు.
అనంతరం విరాట్ కోహ్లీ సెంచరీ సహా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ బ్యాట్ ఝుళిపించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 409 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో తడబడిన బంగ్లాదేశ్ 182 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ బంగ్లా ఓడినప్పటికీ 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది.
సంబంధిత కథనం