Suresh Raina: అతడు టీమిండియాలో ఉండాలి.. సెలక్టర్లు మరోసారి దృష్టిపెట్టండి..యువ ప్లేయర్కు రైనా మద్ధతు
Suresh Raina: పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జితేష్ శర్మపై సురేష్ రైనా ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పటికే టీమిండియాలో చోటు దక్కించుకోవాల్సిందని, సెలక్టర్లు అతడిపై మరోసారి దృష్టిపెట్టాలని అన్నాడు.
Suresh Raina: ఐపీఎల్ 2023 సీజన్లో చాలా మంది యువ ఆటగాళ్లు తమ ఆటతీరుతో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. స్టార్ ప్లేయర్లకు సైతం ధీటుగా సత్తా చాటుతూ ఆకట్టుకుంటున్నారు వీరిలో యశస్వీ జైస్వాల్, ఆయుషి బదోనీ, తిలక్ వర్మ, నేహాల్ వధేరా లాంటి యువ క్రికెటర్లు ఉన్నారు. వీరితో పాటు పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జితేశ్ శర్మ కూడా మెరుగ్గా ఆడుతున్నాడు. మిడిల్, లోవర్ ఆర్డర్లో కీలకంగా రాణిస్తున్న ఈ యువ ప్లేయర్ 11 మ్యాచ్ల్లో 160.49 స్ట్రైక్ రేటుతో 260 పరుగులు చేశాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా భారత మాజీ ప్లేయర్ సురేష్ రైనా సైతం అతడిపై స్పందించారు. జితేష్ శర్మ కచ్చితంగా టీమిండియాలో ఉండాల్సిందని, సెలక్టర్లు అతడిపై మరోసారి దృష్టి పెట్టాలని అన్నాడు.
ట్రెండింగ్ వార్తలు
"మిడిల్ ఆర్డర్లో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. కొన్ని మ్యాచ్ల్లో కీలకంగా మారాడు. అంతేకాకుండా దూకుడుగా ఆడుతున్నాడు. అతడు ఇప్పటికే ఇండియన్ టీమ్లో ఆడాల్సి ఉంది. మిడిల్ ఆర్డర్లో గొప్పగా ఆడుతున్నాడు. అతడి వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి. బ్యాటింగ్లో ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సెలక్టర్లు మరోసారి అతడిపై దృష్టిపెడతారనుకుంటున్నా. అతడి హిట్టింగ్ నైపుణ్యం అద్భుతం. భవిష్యత్తులో అతడి నుంచి ఇంకా చాలా చూస్తారు." అని సురేష్ రైనా తెలిపాడు.
మిడిల్ ఆర్డర్లో టీమిండియాకు జితేష్ శర్మ గ్రేట్ ఆప్షన్ అని సురేష్ అన్నాడు. సెలక్టర్లు అతడిని తప్పకుండా తీసుకోవాలని సూచించాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన జితేష్ శర్మ 260 పరుగులు చేశాడు.
2016-17 సీజన్లో తన ఐపీఎల్ కెరీర్ ఆరంభించిన జితేష్.. ముంబయి ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అయితే అతడికి అప్పుడు సరైన అవకాశం రాలేదు. అనంతరం దేశవాళీ టోర్నీల్లో విదర్భ తరఫున అద్భుతంగా రాణించడంతో 2022 వేలంలో పంజాబ్ కింగ్స్ దృష్టిని ఆకర్షించాడు. అప్పటి నుంచి పంజాబ్ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు.