Kaif on Sam Curran : సామ్ కర్రాన్ 18 కోట్ల ప్రైస్ ట్యాగ్ మీద టార్గెట్ చేయడం సరికాదు
Kaif on Sam Curran : ఐపీఎల్ లో 18.50 కోట్లు తీసుకున్న సామ్ కర్రాన్ నిరాశపరిచాడని అభిమానులు, మాజీ క్రికెటర్లు, విమర్శిస్తున్నారు. అయితే తాజాగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ విమర్శకులపై విరుచుకుపడ్డాడు. సామ్ కర్రాన్ మద్దతుగా నిలిచాడు.
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్(Sam Curran)ను పంజాబ్ కింగ్స్ 18.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఒక ఆటగాడు అందుకున్న అత్యంత ఖరీదైన మొత్తం కూడా ఇదే. కానీ సామ్ కర్రాన్ మాత్రం తనకు వచ్చిన దానికి న్యాయం చేయలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
18.50 కోట్లు తీసుకుని నిరుత్సాహపరిచిన సామ్ కర్రాన్ పై అభిమానులు, మాజీ క్రికెటర్లు, విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(mohammad kaif) విమర్శకులపై మండిపడ్డాడు. ప్రైస్ ట్యాగ్ పేరుతో ఆటగాళ్ల ప్రదర్శనను అంచనా వేయడం సరికాదన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో సామ్ ఇచ్చిన ప్రదర్శన కారణంగా పంజాబ్ కింగ్స్ అతనిపై భారీ మొత్తంలో కుమ్మరించిందని తెలిపాడు. 18.50 కోట్లు వస్తోందని ప్రాణాలను పణంగా పెడితే ఎలా అని ప్రశ్నించాడు.
'ఏ ఆటగాడు ఎవరినీ అంత డబ్బు అడగడు. అతని గత ప్రదర్శన ఆధారంగా ఫ్రాంచైజీలు డబ్బు కుమ్మరిస్తాయి. ఆటగాళ్ళ తప్పు ఏంటి. అంతర్జాతీయ ఆట, ఐపీఎల్ ఒకేలా ఉండవు. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. పంజాబ్ కింగ్స్ జట్టులో సమస్య గురించి పట్టించుకోలేదు. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ రబాడ అట్టర్ ఫ్లాప్ షో ఇచ్చాడు. ఇదే జట్టు పరాజయానికి కారణం. కానీ ఈ సమస్య ఎవరికీ తెలియదు. కానీ 18.50 కోట్లు సంపాదించినందుకే సామ్ మీద విమర్శలు చేస్తున్నారు.' అని కైఫ్ చెప్పాడు.
ఐపీఎల్ 16వ ఎడిషన్ లీగ్ దశలోనే పంజాబ్ కింగ్స్ నిష్క్రమించింది. ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తర్వాత ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన 3వ జట్టుగా నిలిచింది. ఆడిన 14 మ్యాచ్ల్లో 6 మాత్రమే గెలిచి 8 ఓడింది.