Arijit Touched Dhoni Feet: ధోనీ కాళ్లు పట్టుకున్న అర్జిత్ సింగ్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Arijit Touched Dhoni Feet: శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2023 ఓపెనింగ్ సెర్మనీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ ఈవెంట్లో పాడేందుకు వచ్చిన బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్.. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ కాళ్లు పట్టుకున్నాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Arijit Touched Dhoni Feet: ఎంఎస్ ధోనీ.. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన క్రికెటర్లలో ముందుంటాడు. తన ఆటతీరు, కెప్టెన్సీ స్కిల్స్తో ఎన్నో మ్యాచ్ల్లో జట్టుకు విజయాన్ని అందించాడు. తన కెరీర్లో రెండు వరల్డ్ కప్లు సహా ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అందించాడు. ఇంక ఐపీఎల్లో అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. అలాంటి మహీ గొప్పదనాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. తాజాగా ఐపీఎల్ 2023 ఓపెనింగ్స్ సెర్మనీలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఈవెంట్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చిన బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్.. ధోనీ కాళ్లకు మొక్కాడు. మహీ వేదిక మీదకు రాగానే అతడి కాళ్లను తాకాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ట్రెండింగ్ వార్తలు
అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఐపీఎల్ ప్రారంభోత్సవంలో ఇండియన్ స్టార్లు తమన్నా, రష్మిక మందన్నా తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కూడా హిందీ పాటలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. అయితే చెన్నై కెప్టెన్ ధోనీ వేదికపైకి రాగానే.. అందరిని అతడు పరిచయం చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇదే క్రమంలో అర్జిత్ సింగ్ వద్దకు రాగానే.. అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వబోగా అర్జిత్ కిందకు వంగి మహీ కాళ్లను పట్టుకున్నాడు.
వెంటనే తేరుకున్న ధోనీ వద్దని వారిస్తూ అతడిని పైకి లేపాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్లు కూడా ఈ సంఘటనపై విశేషంగా స్పందిస్తున్నారు. ధోనీ పట్ల అర్జిత్కున్న గౌరవభావాన్ని చూసి అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ దృశ్యం చూసేందుకు చాలా బాగుందంటూ మరో యూజర్ కామెంట్ పెట్టారు.
ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుభ్మన్ గిల్(63) అర్ధశతకంతో ఆకట్టుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మరో నాలుగు బంతులు మిగిలుండగానే గుజరాత్ విజయాన్ని అందుకుంది. చెన్నై బౌలర్లలో రాజవర్ధన్ మూడు వికెట్లు తీశాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 92 పరుగులతో రాణించాడు.