Telugu News  /  Sports  /  India Women Team Won By 88 Runs Against England Women
ఇంగ్లాండ్‌పై భారత అమ్మాయిల విజయం
ఇంగ్లాండ్‌పై భారత అమ్మాయిల విజయం (Action Images via Reuters)

EnglandW vs IndiaW 2nd ODI: ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం.. సెంచరీతో హర్మన్ విజృంభణ

22 September 2022, 7:12 ISTMaragani Govardhan
22 September 2022, 7:12 IST

England Women vs India Women 2nd ODI: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే భారత అమ్మాయిలు 88 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకున్నారు.

England Women vs India Women: ఇంగ్లాండ్ -భారత మహిళల జట్టు మధ్య జరిగిన రెండో వన్డేలో ఇండియన్ అమ్మాయిలు విజయం సాధించారు. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు.. వన్డే సిరీస్‌లో మాత్రం సత్తా చాటింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. కాంటెర్ బరీ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు 88 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా నిర్దేశించిన 334 పరుగుల లక్ష్య ఛేదనంలో ఇంగ్లీష్ జట్టు 245 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో డెనియల్లీ వ్యాట్(65) అర్ధశతకం మినహా మిగిలిన వారు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆకట్టుకోలేదు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లతో దుమ్మురేపగా.. హేమలత రెండు వికెట్లతో రాణించింది.

ట్రెండింగ్ వార్తలు

334 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌కు శుభారంభమేమి దక్కలేదు. ఆరంభంలోనే ఓపెనర్ బేమౌంట్‌ను హర్మన్ రనౌట్ చేసింది అదరగొట్టింది. అనంతరం మరో బ్యాటర్ సోఫియా డంక్లీని రేణుకా సింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపింది. ఇలాంటి సమయంలో మరో ఓపెనర్ ఎమ్మా లాంబ్, ఎలైస్ క్యాప్సీ కాసేపు క్రీజులో నిలిచే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మానును రేణుకా మరోసారి ఎల్బీగా పెవిలియన్ చేర్చింది. దీంతో 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది ఇంగ్లీష్ వుమెన్స్ జట్టు. ఇలాంటి సమయంలో అలైస్ క్యాప్సీ-డెనియల్లీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

అయితే ఈ సారి దీప్తి శర్మ అలైస్‌ను ఔట్ చేయడంతో వీరి జోడికి బ్రేక్ పడింది. అనంతరం కెప్టెన్ అమీతో కలిసి వ్యాట్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోయారు. ఐదో వికెట్‌కు వీరు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే వ్యాట్ అర్ధశతకం పూర్తి చేసుకుంది. అయితే ఆ కాసేపటికే రేణుకా సింగ్ బౌలింగ్‌లో బౌల్డయింది. అనంతరం ఇంగ్లాండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో చార్లోట్టె డీన్ కాసేపు మెరుపులు మినహా.. మిగిలిన వారు విఫలమయ్యారు. ఆమె కాసేపు బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లీష్ జట్టు భారీ ఓటమి నుంచి తప్పించుకుంది. చివరకు 44.2 ఓవర్లలో 245 పరుగుల వద్ద ఆలౌటైంది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 333 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌక్ సెంచరీ విజృంభించింది. 111 బంతుల్లో 143 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమె 18 ఫోర్లు, 4 సిక్సర్లతో అదరగొట్టింది. హర్మన్ సెంచరీకి తోడు హర్లీన్ డియోల్ అర్దశతకం చేయడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఓ దశలో 99 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును.. హర్మన్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో గాడిన పెట్టింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లారె్ బెల్, కేట్ క్రాస్, ఫ్రెయా కెంప్, చార్లెట్ డీన్, ఎకెల్‌స్టోన్ తలో వికెట్ తీశారు.

<p>హర్మన్ సెంచరీ</p>
హర్మన్ సెంచరీ (PTI)