Badminton Asia Mixed Team: చైనా నుంచి వట్టిచేతులతో.. భారత్ కు షాక్.. ఆసియా మిక్స్ డ్ టీమ్ బ్యాడ్మింటన్ లో ఔట్
Badminton Asia Mixed Team: ఎన్నో అంచనాలతో ఆసియా మిక్స్ డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ బరిలో దిగిన భారత్ కు షాక్. గోల్డ్ పై గురిపెట్టిన టీమ్ కనీసం కాంస్యం కూడా లేకుండా ఇంటిముఖం పట్టింది. క్వార్టర్స్ లో జపాన్ చేతిలో ఓడింది.

కెంటో చేతిలో ఓడిన హెచ్ఎస్ ప్రణయ్, ఆసియా మిక్స్ డ్ టీమ్ బ్యాడ్మింటన్ లో భారత్ కు షాక్ (AFP)
ఆసియా మిక్స్ డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత కథ ముగిసింది. ఎలాంటి పతకం లేకుండా వట్టి చేతులతో భారత్ ఇంటి ముఖం పట్టింది. క్వార్టర్స్ లో మన జట్టు 0-3 తేడాతో మాజీ ఛాంపియన్ జపాన్ చేతిలో ఓటమి పాలైంది. మిక్స్ డ్ డబుల్స్ లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ, పురుషుల సింగిల్స్ లో హెఎస్ ప్రణయ్, మహిళల సింగిల్స్ లో మాళవిక బన్సోద్ పరాజయం చెందారు. ఈ టోర్నీలో 2023లో కాంస్యం గెలిచిన భారత్ ఈ సారి సెమీస్ కూడా చేరలేకపోయింది.
- మిక్స్ డ్ డబుల్స్ లో విజయం కోసం ధ్రువ్-తనీషా జోడీ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ప్రపంచ 12వ ర్యాంకు జోడీ హిరోకి-నత్సు చేతిలో ఓటమి తప్పలేదు. భారత జంట 13-21, 21-17, 13-21తో తలవంచింది. తొలి గేమ్ లో ఓడిన తర్వాత ధ్రువ్-తనీషా ద్వయం రెండో గేమ్ లో పుంజుకుని గెలిచింది. కానీ మూడో గేమ్ లో మళ్లీ ఓటమి వైపు నిలిచింది.
- మహిళల సింగిల్స్ లో ప్రపంచ 8వ ర్యాంకర్ మియజాకిపై భారత యువ షట్లర్ మాళవిక పైచేయి సాధించలేకపోయింది. మాళవిక 12-21, 19-21తో అపజయం చెందింది. రెండో గేమ్ లో గెలుపు కోసం మాళవిక గట్టిగానే పోరాడినా లాభం లేకపోయింది.
- రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ అద్భుతం చేయలేకపోయాడు. అతను 14-21, 21-15, 12-21 తో కెంటా నిషిమొటో చేతిలో ఓడిపోయాడు. రెండో గేమ్ లో గొప్ప ఫైటింగ్ స్పిరిట్ తో గెలిచి ఆశలు రేపిన ప్రణయ్.. మూడో గేమ్ లో పూర్తిగా తేలిపోయాడు.