India vs Bangladesh 2nd Test: గట్టెక్కించారు.. బంగ్లాపై భారత్ ఆలౌట్.. పంత్ సెంచరీ మిస్-india all out for 314 runs against bangladesh in 2nd test 1st innings ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India All Out For 314 Runs Against Bangladesh In 2nd Test 1st Innings

India vs Bangladesh 2nd Test: గట్టెక్కించారు.. బంగ్లాపై భారత్ ఆలౌట్.. పంత్ సెంచరీ మిస్

Maragani Govardhan HT Telugu
Dec 23, 2022 04:26 PM IST

India vs Bangladesh 2nd Test: ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 314 పరుగులకు ఆలౌటైంది. 87 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రిషబ్ పంత్ కొద్దిలో సెంచరీని చేజార్చుకున్నాడు.

314 పరుగులకు భారత్ ఆలౌట్
314 పరుగులకు భారత్ ఆలౌట్ (AP)

India vs Bangladesh 2nd Test: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ మెరుగైన స్కోరు సాధించింది. 86.3 ఓవర్లలో 314 పరుగులు ఆలౌటైంది. ఆరంభంలో తడబడినప్పటికీ మధ్యలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకోవడంతో బంగ్లాదేశ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రిషబ్ పంత్(93) కొద్దిలో సెంచరీ మిస్ చేసుకోగా.. శ్రేయాస్ అయ్యర్(87) అర్ధశతకంతో రాణించాడు. వీరిద్దరూ మినహా మిగిలిన వారు విఫలం కావడంతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో ఓ మాదిరి స్కోరు చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం, షకిబుల్ హసన్ చెరో 4 వికెట్లతో రాణించారు.

ట్రెండింగ్ వార్తలు

టాపార్డర్‌కు తైజుల్ దెబ్బ..

ఓవర్ నైట్ స్కోరు 19/0 పరుగుల వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 27 పరుగుల వద్ద కేఎల్ రాహుల్‌ను(10) తైజుల్ ఇస్లాం ఎల్బీగా వెనక్కి పంపాడు. స్వల్ప వ్యవధిలోనే మరో ఓపెనర్ శుబ్‌మన్‌ గిల్‌ను(20) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపు పుజారా(24) క్రీజులోని పాతుకుపోయేందుకు ప్రయత్నించినా.. అతడిని ఔట్ చేయడానికి కూడా తైజుల్‌కు ఎక్కువ సమయం పట్టేలేదు. ఈ సారి ఆకట్టుకుంటాడనుకున్న కోహ్లీ(24) కూడా నిదానంగా ఆడినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. అతడిని తస్కిన్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 94 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో నిలిచింది భారత్.

ఇలాంటి సమయంలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు. ముందు వికెట్‌ను కోల్పోకుండా క్రీజులో అలాగే నిలుచుని అనంతరం బ్యాట్ ఝుళిపించారు. కాసేపట్లోనే పిచ్‌ను అర్థం చేసుకున్న వీరు బంగ్లా బౌలర్లపైకి ఎదురుదాడికి దిగారు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు కొడుతు స్టేడియాన్ని హోరెత్తించారు. ముఖ్యంగా పంత్.. విశ్వరూపమే చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. శ్రేయాస్ సహాకారంతో అర్ధశతకం పూర్తి చేసుకున్న అతడు అలాగే దూకుడుగా ఆడాడు. 105 బంతుల్లో 93 పరుగులు చేసి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. షకీబుల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

మరోపక్క శ్రేయాస్ కూడా దూకుడుగా ఆడుతూ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ వన్డేను తలపించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే పంత్ ఔట్ కావడంతో మిగిలిన వారు ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. అక్కడ నుంచి వరుసగా వికెట్ల పతనం కావడంతో టీమిండియా 314 పరుగులకు ఆలౌటైంది. చివర్లో ఉమేశ్ యాదవ్ 13 బంతుల్లో 14 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో టాపార్డర్‌ను తైజుల్ ఔట్ చేయగా.. షకిబుల్ టెయిలెండర్ల పనిపట్టాడు. మొత్తంగా బంగ్లాపై 87 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది భారత్. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఓపెనర్లు నజ్ముల్ హొస్సేయిన్, జకీర్ హసన్ ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 227 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

WhatsApp channel

సంబంధిత కథనం