Imran Nazir: నాకు ఎవరో విషం ఇచ్చారు.. అఫ్రిది ఇచ్చిన ఆ డబ్బుతోనే.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు
Imran Nazir: నాకు ఎవరో విషం ఇచ్చారు.. అఫ్రిది ఇచ్చిన ఆ డబ్బుతోనే తన చికిత్స జరిగిందని పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ సంచలన విషయం వెల్లడించాడు. అతడు వెల్లడించిన ఈ విషయాలు సంచలనం రేపుతున్నాయి.
Imran Nazir: పాకిస్థాన్ క్రికెట్ అంటేనే వివాదాలమయం. ఎప్పుడూ ఏదో ఒక వివాదం లేకుండా రోజు గడవదు. తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ కూడా సంచలన విషయం వెల్లడించాడు. తనకు ఎవరో విషం ఇచ్చారని, దీని కారణంగా తన శరీరంలో జాయింట్లు మొత్తం దెబ్బతిన్నాయని, చికిత్స కోసమే తాను పాక్ కరెన్సీలో 12 నుంచి 15 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పాడు.
ట్రెండింగ్ వార్తలు
అయితే ఈ కష్టకాలంలో మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తనకు చేతనైన సాయం చేశాడని, 50 లక్షల వరకూ ఇచ్చినట్లు నజీర్ వెల్లడించాడు. అయితే తనకు విషం ఎవరు ఇచ్చారన్న విషయం మాత్రం తెలియదని అతడు చెప్పాడు. నజీర్ 1999 నుంచి 2012 మధ్య పాక్ తరఫున 8 టెస్టులు, 79 వన్డేలు ఆడాడు.
"ఈ మధ్యే నాకు చికిత్స జరిగినప్పుడు, ఎమ్మారై స్కాన్లు తీశారు. అందులో నాకు ఎవరో మెర్క్యూరీ అనే పాయిజన్ ఇచ్చినట్లు తేలింది. ఇదొక స్లో పాయిజన్. ఇది మెల్లగా జాయింట్స్ లోకి వెళ్లి వాటిని నాశనం చేస్తుంది. గత 8 నుంచి 10 ఏళ్లలో వీటికి చికిత్స చేయించుకున్నాను. ఈ కారణం వల్లే నేను ఆరేడేళ్లు తీవ్రంగా బాధపడ్డాను. నా జాయింట్లన్నీ దెబ్బ తిన్నాయి. కానీ అలాంటి పరిస్థితి నుంచి కూడా నేను పూర్తిగా బెడ్ కే పరిమితం కాకుండా బయటపడ్డాను" అని నజీర్ చెప్పాడు.
"నేను అలా బయటకు వచ్చి తిరుగుతున్నప్పుడు చాలా మంది నేను మళ్లీ కోలుకున్నానని అన్నారు. అప్పుడు చాలా మందిపై నాకు అనుమానం కలిగింది. కానీ నేను ఎప్పుడు, ఎక్కడ ఏం తిన్నానో గుర్తు లేదు. ఎందుకంటే ఆ పాయిజన్ కూడా వెంటనే పని మొదలుపెట్టదు. మెల్లగా చంపేస్తుంది. ఆ విషం ఎవరిచ్చారో తెలియదు కానీ వాళ్లకు కూడా నేనెప్పుడూ కీడు కోరుకోలేదు" అని నజీర్ అన్నాడు.
తనకు చికిత్స కోసం రూ. 10 నుంచి 12 కోట్లు ఖర్చయ్యాయని, అందులో మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది రూ.50 లక్షల వరకూ సాయం చేశాడని చెప్పాడు. తనకు అవసరమైన సమయంలో అఫ్రిది ఆదుకున్నట్లు గుర్తు చేసుకున్నాడు. చికిత్స కోసమే తాను జీవితాంతం సంపాదించిన సొమ్మంతా కరిగిపోయిందని, ఆ సమయంలో తాను అఫ్రిదిని కలిసినప్పుడు అతడు రూ.50 లక్షల వరకూ ఇచ్చాడని వెల్లడించాడు.
సంబంధిత కథనం
టాపిక్