ICC Media Rights: టీవీ హక్కులు జీ చేతికి.. డిస్నీ స్టార్ కొత్త ఒప్పందం
ICC Media Rights: టీవీ హక్కులను జీ(Zee)కి అప్పగించింది డిస్నీ స్టార్. ఈ మధ్యే ఐసీసీ మీడియా హక్కులను నాలుగేళ్ల కాలానికి డిస్నీ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ICC Media Rights: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించబోయే మెగా టోర్నీల మీడియా హక్కులను ఈ మధ్యే భారీ మొత్తానికి డిస్నీ స్టార్ సొంతం చేసుకుంది. 2024-27 మధ్య కాలానికిగాను 300 కోట్ల డాలర్లకు ఈ హక్కులను దక్కించుకుంది. అయితే ఇప్పుడు డిస్నీ స్టార్ వాటిని సబ్ లైసెన్స్కు ఇవ్వడం గమనార్హం.
ట్రెండింగ్ వార్తలు
ఈ మేరకు జీ (Zee)తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం.. 2024-27 మధ్య కాలంలో ఐసీసీ టోర్నీలను డిజిటల్ హక్కులు మాత్రమే డిస్నీ స్టార్ దగ్గర ఉంటాయి. టీవీ హక్కులు మాత్రం జీకి దక్కాయి. అంటే ఈ నాలుగేళ్లలో జరగబోయే మెగా టోర్నీల టీవీ హక్కులన్నీ జీ సొంతం చేసుకుంది. 2024 టీ20 వరల్డ్కప్, 2026 టీ20 వరల్డ్కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2027 వన్డే వరల్డ్కప్, ఇతర అండర్-19 టోర్నీల మ్యాచ్లను జీ ప్రసారం చేస్తుంది.
వీటి డిజిటల్ హక్కులు మాత్రం డిస్నీతోనే ఉంటాయి. అంటే ఈ మ్యాచ్లన్నీ తమ డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన హాట్స్టార్లో ప్రసారం చేయనుంది. ఇండియన్ మీడియా & ఎంటర్టైన్మెంట్లో ఇలాంటి ఒప్పందం జరగడం ఇదే తొలిసారి అని జీ ఎంటర్టైన్మెంట్ ఎండీ పునీత్ గోయెంకా అన్నారు. జీ నెట్వర్క్కు సంబంధించిన స్పోర్ట్స్ ఛానెల్స్లో ఐసీసీ టోర్నీల మ్యాచ్లు ప్రసారం కానున్నాయి.
2007లో రెబల్ లీగ్ ఐసీఎల్ను ప్రారంభించిందన్న ఉద్దేశంతో జీ నెట్వర్క్ను బీసీసీఐ, ఐసీసీ బ్లాక్లిస్ట్ చేశాయి. ఆ తర్వాత ఇంత కాలానికి ఆ సంస్థ ఇంత భారీ క్రికెట్ కాంట్రాక్ట్ను దక్కించుకుంది. కొన్ని నెలల కిందట బీసీసీఐతో జీ నెట్వర్క్ రాజీ కుదుర్చుకుంది. ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలోనూ పాలు పంచుకుంది.