Graeme Smith: సౌతాఫ్రికా టీ20 లీగ్‌ చీఫ్‌గా గ్రేమ్‌ స్మిత్‌-graeme smith to lead the south africa t20 league ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Graeme Smith To Lead The South Africa T20 League

Graeme Smith: సౌతాఫ్రికా టీ20 లీగ్‌ చీఫ్‌గా గ్రేమ్‌ స్మిత్‌

Hari Prasad S HT Telugu
Jul 19, 2022 03:15 PM IST

Graeme Smith: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌కు అక్కడి క్రికెట్‌ బోర్డు పెద్ద బాధ్యతలే అప్పగించింది. ఐపీఎల్‌ తరహాలోనే సౌతాఫ్రికాలోనూ ప్రారంభం కాబోయే లీగ్‌ను స్మిత్‌ నడిపించనున్నాడు.

ఈ కొత్త లీగ్ ను నడిపించనున్న సౌతాఫ్రికా టీమ్ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్
ఈ కొత్త లీగ్ ను నడిపించనున్న సౌతాఫ్రికా టీమ్ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (AP)

కేప్‌టౌన్‌: ఐపీఎల్‌ నుంచి స్ఫూర్తి పొంది అదే ఐడియాతో సౌతాఫ్రికా ఓ టీ20 లీగ్‌ను తీసుకొస్తోంది. ఈ లీగ్‌ వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో జరగనుంది. అయితే ఈ లీగ్‌ హెడ్‌గా సౌతాఫ్రికా క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాటర్‌ గ్రేమ్ స్మిత్‌ను నియమించింది అక్కడి క్రికెట్‌ బోర్డు. ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు. క్రికెట్‌పై అతనికున్న అవగాహన లీగ్‌కు మరింత బలాన్ని ఇస్తుందని క్రికెట్‌ సౌతాఫ్రికా ఒక ప్రకటనలో అభిప్రాయపడింది.

ట్రెండింగ్ వార్తలు

"స్మిత్‌ ఈ లీగ్‌కు ఎంతో అనుభవాన్ని, గేమ్‌పై తనకున్న అవగాహనను మోసుకొస్తాడు. క్రికెట్‌లో ఓ ప్లేయర్‌గా, కెప్టెన్‌గా, కామెంటేటర్‌గా, అంబాసిడర్‌గా, కన్సల్టెంట్‌గా, ఈ మధ్యే క్రికెట్‌ సౌతాఫ్రికా డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా ఎన్నో బాధ్యతలు అతడు నిర్వర్తించాడు. స్మిత్‌ నాయకత్వ లక్షణాలు, నిర్ణయాత్మక, స్పష్టమైన ఆలోచన విధానం వల్ల అతనికి లీగ్‌ను లీడ్‌ చేసే అవకాశం ఇస్తున్నాం" అని క్రికెట్ సౌతాఫ్రికా ఆ ప్రకటనలో వెల్లడించింది.

సౌతాఫ్రికా టీమ్‌ను పదేళ్ల పాటు మూడు ఫార్మాట్లలో విజయవంతమైన టీమ్‌గా ముందుండి నడిపించాడు గ్రేమ్‌ స్మిత్‌. ఆ తర్వాత క్రికెట్‌ సౌతాఫ్రికా డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా కూడా ఉన్నాడు. దీంతో ఇప్పుడు లీగ్‌ అభివృద్ది బాధ్యతలను అతనికి అప్పగించారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించడం ఎంతో గౌరవంగా ఫీలవుతున్నట్లు స్మిత్‌ చెప్పాడు. క్రికెట్‌కు కావాల్సిన పెట్టుబడిని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లేయర్స్‌కు కొత్త అవకాశాలను ఈ లీగ్‌ అందిస్తుందని అన్నాడు.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో జరగనుంది. ఈ లీగ్‌ కోసం ఈ మధ్యే సౌతాఫ్రికా అదే సమయంలో ఆస్ట్రేలియాతో జరగాల్సిన వన్డే సిరీస్‌ను కూడా రద్దు చేసుకుంది. మరోవైపు ఈ లీగ్‌లో ఆరు టీమ్స్‌ ఉండనున్నాయి. అయితే వీటన్నింటినీ ఐపీఎల్‌కు చెందిన ఫ్రాంఛైజీలే భారీ బిడ్లతో సొంతం చేసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్