England vs Pakistan: ఇంగ్లండ్ టీమ్ మొత్తానికీ వైరల్ ఫీవర్.. పాకిస్థాన్తో తొలి టెస్ట్ డౌటే
England vs Pakistan: ఇంగ్లండ్ టీమ్ మొత్తానికీ వైరల్ ఫీవర్ సోకడం గమనార్హం. దీంతో పాకిస్థాన్తో తొలి టెస్ట్ను వాయిదే వేసే ఆలోచనలో పాక్ క్రికెట్ బోర్డు ఉంది.
England vs Pakistan: ఒకరు ఇద్దరు కాదు.. ఇంగ్లండ్ క్రికెట్ టీమ్లో సగం కంటే ఎక్కువ మంది అంతుచిక్కని వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. దీంతో పాకిస్థాన్తో జరగబోయే తొలి టెస్ట్ను వాయిదా వేసే ఆలోచనలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఉన్నాయి. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు తన ట్విటర్ ద్వారా వెల్లడించింది.
ట్రెండింగ్ వార్తలు
"కొందరు ఇంగ్లండ్ ప్లేయర్స్ వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు. దీంతో పాక్, ఇంగ్లండ్ మధ్య జరగబోయే తొలి టెస్ట్పై పీసీబీ, ఈసీబీ చర్చిస్తున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. దీనిపై మరింత సమాచారాన్ని ఈసీబీతో మాట్లాడిన తర్వాత వెల్లడిస్తాం" అని పాక్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది.
ఇంగ్లండ్ టీమ్లో కేవలం ఐదుగురు క్రికెటర్లు మాత్రమే బుధవారం (నవంబర్ 30) ప్రాక్టీస్ కోసం వచ్చారు. హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, కీటన్ జెన్నింగ్స్, ఓలీ పోప్, జో రూట్ మాత్రమే నెట్స్లో ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా మిగతా ప్లేయర్స్ అందరూ హోటల్ రూమ్స్కే పరిమితమయ్యారు.
ఈ వైరల్ ఫీవర్లపై రూట్ స్పందించాడు. "నాకు తెలిసినంత వరకూ కొంతమంది 100 శాతం ఫిట్గా లేరు. నిన్న నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇవాళ చాలా బెటర్గా ఫీలవుతున్నాను. ఇది 24 గంటల వైరస్ అయితే బాగుంటుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్, లేదా కొవిడ్ లేదా మరొకటని నేను అనుకోవడం లేదు. మ్యాచ్ కోసం సిద్ధంగా ఉండేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం" అని రూట్ చెప్పాడు.
ఇప్పటికే తొలి టెస్ట్ కోసం ఇంగ్లండ్ తన తుది జట్టును కూడా ప్రకటించింది. లియామ్ లివింగ్స్టోన్ తన టెస్ట్ అరంగేట్రం చేస్తున్నాడు. ఒకవేళ తొలి మ్యాచ్కు స్టోక్స్ దూరమైతే తాను కెప్టెన్సీ చేపట్టబోనని ఈ సందర్భంగా రూట్ స్పష్టం చేశాడు. పాకిస్థాన్తో 2005 తర్వాత ఇప్పుడు రావల్పిండి, ముల్తాన్, కరాచీలలో మూడు టెస్ట్లు ఇంగ్లండ్ ఆడనుంది. టీ20 వరల్డ్కప్ ముందు కూడా పాకిస్థాన్లో పర్యటించిన ఇంగ్లండ్ ఏడు టీ20ల సిరీస్ ఆడిన విషయం తెలిసిందే.