Cheteshwar Pujara Record: పుజారా మరో ఘనత.. ఈ లిస్ట్లో చేరిన 8వ ఇండియన్ క్రికెటర్
Cheteshwar Pujara Record: పుజారా మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో 7 వేల పరుగులు చేసిన 8వ ఇండియన్ క్రికెటర్గా అతడు రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఈ మైలురాయిని అందుకున్నాడు.
Cheteshwar Pujara Record: టీమిండియా క్రికెటర్ చెతేశ్వర్ పుజారా శుక్రవారం (డిసెంబర్ 23) టెస్టుల్లో మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో పుజారా టెస్టుల్లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన 8వ ఇండియన్ క్రికెటర్గా పుజారా నిలిచాడు.
ట్రెండింగ్ వార్తలు
రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు పుజారా ఈ రికార్డుకు 16 పరుగుల దూరంలో ఉన్నాడు. రెండో రోజు ఉదయం సెషన్లో తొలి వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన అతడు.. త్వరగానే 7 వేల పరుగుల మైల్స్టోన్ను అందుకున్నాడు. పుజారాకు ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీలు టెస్టుల్లో 7 వేల కంటే ఎక్కువ రన్స్ చేశారు.
అయితే తొలి ఇన్నింగ్స్లో ఈ రికార్డు అందుకున్న కాసేపటికే పుజారా ఔటయ్యాడు. అతడు 24 రన్స్ చేసి తైజుల్ ఇస్లామ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఇండియన్ టీమ్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నయా వాల్గా ఒకప్పటి రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసిన పుజారా.. గతేడాది ఫామ్ కోల్పోయాడు. ఈ ఏడాది మొదట్లో అతన్ని టీమ్లో నుంచి తొలగించారు.
అయితే కౌంటీ క్రికెట్ మరోసారి పుజారా కెరీర్ను మలుపు తిప్పింది. అక్కడ టన్నుల కొద్దీ రన్స్ చేసి మళ్లీ ఫామ్లోకి వచ్చిన పుజారా తిరిగి ఇండియన్ టీమ్లోకి వచ్చాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్లోనూ విజయంలో పుజారాదే కీలకపాత్ర. తొలి ఇన్నింగ్స్లో 90, రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు. టెస్టుల్లో సుమారు నాలుగేళ్ల తర్వాత పుజారా సాధించిన సెంచరీ ఇది.
చివరిసారి 2019, జనవరిలో ఆస్ట్రేలియాపై సిడ్నీలో అతడు సెంచరీ చేశాడు. ఆ తర్వాత క్రమంగా ఫామ్ కోల్పోతూ వస్తున్నాడు. ఈ ఏడాది టీమ్లో ప్లేస్ కోల్పోయినా.. తిరిగి కౌంటీల్లోకి వెళ్లి తన మునుపటి ఫామ్ను అందుకోవడం విశేషం.