WTC Final: హెడ్ శతక బాదుడు, స్మిత్ క్లాస్ ఇన్నింగ్స్: తొలి రోజు ఆస్ట్రేలియాదే: తేలిపోయిన భారత బౌలర్లు-australia dominate in wtc final first day team india bowlers ineffective on oval pitch ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final: హెడ్ శతక బాదుడు, స్మిత్ క్లాస్ ఇన్నింగ్స్: తొలి రోజు ఆస్ట్రేలియాదే: తేలిపోయిన భారత బౌలర్లు

WTC Final: హెడ్ శతక బాదుడు, స్మిత్ క్లాస్ ఇన్నింగ్స్: తొలి రోజు ఆస్ట్రేలియాదే: తేలిపోయిన భారత బౌలర్లు

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియా అదరగొట్టింది. ట్రావిస్ హెడ్ శతకంతో చెలరేగగా.. స్మిత్ సెంచరీకి చేరువయ్యాడు.

WTC Final: హెడ్ శతక బాదుడు, స్మిత్ క్లాస్ ఇన్నింగ్స్: తొలి రోజు ఆస్ట్రేలియాదే: తేలిపోయిన భారత బౌలర్లు (Reuters)

WTC Final - India vs Australia : ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ తొలి రోజున ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చూపించింది. భారత బౌలర్లు తేలిపోయారు. బుధవారం లండన్‍లోని ఓవల్ మైదానంలో ప్రారంభమైన డబ్ల్యూటీసీ ఫైనల్‍లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‍.. అనుకున్న ప్లాన్‍లను అమలు చేయలేకపోయింది. ట్రావిస్ హెడ్ (156 బంతుల్లో 146 రన్స్ నాటౌట్, 22 ఫోర్లు, ఓ సిక్సర్) శకతంతో దూకుడుగా ఆడగా.. స్టీవ్ స్మిత్ (227 బంతుల్లో 95 నాటౌట్, 14 ఫోర్లు) క్లాస్‍ చూపించాడు. దీంతో తొలి రోజు ముగిసే సరికి 85 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 327 పరుగులు చేసింది. హెడ్, స్మిత్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీకి చెరో వికెట్ దక్కింది. చివరి 60 ఓవర్లలో టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక తేలిపోయారు. వివరాలివే..

ఆరంభం ఓకే..

ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. అనంతరం నాలుగో ఓవర్‌లోనే ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0)ను డకౌట్ చేసి డగౌట్‍కు పంపాడు ఇండియా పేసర్ మహమ్మద్ సిరాజ్. దూకుడుగా ఆడుతున్న మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌(46)ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. ఈ రెండు క్యాచ్‍లను తెలుగబ్బాయి, వికెట్ కీపర్ కేఎస్ భరత్ పట్టాడు. లంచ్ బ్రేక్ ముగిసిన కాసేపటికే ఆసీస్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ (26)ను మహమ్మద్ షమీ బౌల్డ్ చేశాడు. ఆ సమయంలో 76 పరుగుల వద్ద మూడో వికెట్‍ను ఆస్ట్రేలియా కోల్పోయింది.

హెడ్ దూకుడు, స్మిత్ క్లాస్

లబుషేన్ ఔటయ్యాక ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్.. భారత బౌలర్లలో ఓ ఆటాడుకున్నారు. ఓ వైపు హెడ్ దూకుడుగా ఆడుతుంటే.. సీనియర్ స్మిత్ మాత్రం కాసేపు డిఫెన్స్ ఆడాడు. స్మిత్ అచితూచి బంతులను ఆపాడు. హెడ్ మాత్రం ఏ దశలోనూ బాదుడు తగ్గించలేదు. ఈ క్రమంలో 60 బంతుల్లోనే 50 పరుగులను పూర్తి చేసుకున్నాడు హెడ్. ఆ తర్వాత కూడా బౌండరీల మోత మోగించాడు. 106 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు హెడ్. చూస్తుండగానే 146 పరుగులకు చేరుకున్నాడు. హెడ్ మొత్తంగా 22 ఫోర్లు బాదాడు.

ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 144 బంతుల్లో అర్ధశకతం పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ముగిసే సరికి 95 పరుగులతో సెంచరీకి చేరువై క్రీజులో ఉన్నాడు. రెండో రోజు ఆటను హెడ్, స్మీత్ ప్రారంభించనున్నారు. ఇక వీరిద్దరూ నాలుగో వికెట్‍కు 251 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ముందు 76 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్.. ఆ తర్వాత మరో వికెట్ కోల్పోలేదు.

24.1 ఓవర్లలో మూడు వికెట్లు తీసిన భారత బౌలర్లు.. ఆ తర్వాత 60.5 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్‍కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది.

సంబంధిత కథనం