Akash Chopra on PCB letter: నేను రాసిస్తాను.. పాకిస్థాన్కు అంత సీన్ లేదు.. వాళ్లే వస్తారు!
Akash Chopra on PCB letter: నేను రాసిస్తాను.. పాకిస్థాన్కు అంత సీన్ లేదు.. వాళ్లే వరల్డ్కప్కు వస్తారు అని అన్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. అదే సమయంలో ఇండియా మాత్రం కచ్చితంగా పాకిస్థాన్ వెళ్లదని కూడా స్పష్టం చేశాడు.
Akash Chopra on PCB letter: ఆసియా కప్ 2023 విషయంలో బీసీసీఐ, పీసీబీ మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలుసు కదా. వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగాల్సిన ఆసియా కప్ను తటస్థ వేదికలో నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ అధ్యక్షుడు కూడా అయిన జై షా చెప్పారు. దీనిపై ఘాటుగా స్పందించిన పాక్ క్రికెట్ బోర్డు.. అదే జరిగితే వచ్చే ఏడాది ఇండియాలో జరగబోయే వరల్డ్కప్ నుంచి తప్పుకోవచ్చని హెచ్చరించింది.
ట్రెండింగ్ వార్తలు
అయితే ఈ వార్నింగ్ను టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తేలిగ్గా తీసుకున్నాడు. ఇండియా కచ్చితంగా పాకిస్థాన్ వెళ్లదని, అదే సమయంలో పాకిస్థాన్ మాత్రం కచ్చితంగా వరల్డ్కప్లో ఆడటానికి ఇండియా వస్తుందని అన్నాడు. కావాలంటే తాను రాసిస్తానని కూడా చెప్పడం విశేషం.
"ఇండియా ఆడకపోతే అసలు ఆసియాకప్ మొత్తానికి రద్దయ్యే అవకాశం కూడా ఉంది. వరల్డ్కప్తో పోలిస్తే ఆసియా కప్ చాలా చిన్నది. వరల్డ్కప్ నుంచి తప్పుకుంటే ఐసీసీ పంచే భారీ ఆదాయాన్ని కోల్పోతారు. అందుకే ఈ విషయాన్ని నేను సీరియస్గా తీసుకోవడం లేదు. ఆసియా కప్ 2023 తటస్థ వేదికలోనే జరుగుతుందని నేను భావిస్తున్నాను" అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో స్పష్టం చేశాడు.
ఆసియా క్రికెట్ కౌన్సిల్లో బీసీసీఐ పెద్దన్న పాత్ర పోషిస్తోందని, ఇందులో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకపోగా.. ఇతర బోర్డులకు పంచిపెడుతోందని కూడా చోప్రా చెప్పాడు. "ఏసీసీ ఒక కన్సార్టియం. అయితే ఏసీసీ నుంచి ఇండియా ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదని చాలా కొద్ది మందికే తెలుసు. ప్రతి ఒక్కరూ ఖజానా నుంచి ఎంతో కొంత తీసుకుంటున్నారు. ఇండియా ఆ మొత్తాన్ని పంచి పెడుతోంది" అని చోప్రా వెల్లడించాడు.
"ఏసీసీలో ఇండియా పెద్దన్న పాత్ర పోషిస్తోంది. పాకిస్థాన్ వెళ్లబోమని ఇండియా చెప్పింది అంటే.. కచ్చితంగా వెళ్లదని నేను రాసిస్తాను. ఆసియా కప్ తటస్థ వేదికలోనే జరుగుతుంది. ఇక పాకిస్థాన్ కూడా కచ్చితంగా ఇండియాలో వరల్డ్కప్ ఆడటానికి వస్తుంది. ఇదంతా రాసివ్వమన్నా రాసిస్తా. ఇవన్నీ కచ్చితంగా జరిగేవే" అని చోప్రా స్పష్టం చేశాడు.