Diwali 2024: దీపావళి పండుగ చూడాలంటే ఈ ప్రదేశాలను సందర్శించాల్సిందే-you must visit these places to see diwali celebrations in india ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Diwali 2024: దీపావళి పండుగ చూడాలంటే ఈ ప్రదేశాలను సందర్శించాల్సిందే

Diwali 2024: దీపావళి పండుగ చూడాలంటే ఈ ప్రదేశాలను సందర్శించాల్సిందే

Gunti Soundarya HT Telugu

Diwali 2024: దేశవ్యాప్తంగా దీపావళి పండుగను సంబరంగా జరుపుకుంటారు. కానీ కొన్ని ప్రదేశాలలో జరిగే దీపావళి వేడుకలు మాత్రం మనసుకు హత్తుకుంటాయి. వాటిని చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. భారత్ లో అత్యంత కన్నుల పండుగగా జరిగే దీపావళి వేడుకలు చూడాలంటే ఈ ప్రదేశాలు సందర్శించాల్సిందే.

దీపావళి పండుగ 2024 (freepik)

దీపాల పండుగ దీపావళిని అందరూ జరుపుకుంటారు. భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఇదీ ఒకటి. దేశవ్యాప్తంగా కుల, మత భేదాలు లేకుండా ఆనందంగా వేడుకలు చేసుకుంటారు.

ఇంటిని దీపాలతో అందంగా అలంకరించుకుంటారు. వీధులన్నీ పండుగ వాతావరణంతో చూడముచ్చటగా అనిపిస్తుంది. చీకటిపై వెలుగు సాధించి విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు లంకాధిపతి రావణాసురిడి సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు దీపావళి పండుగ జరుపుకున్నారని చెబుతారు. దీపావళి పండుగ అందరూ జరుపుకుంటారు. కానీ కొన్ని ప్రదేశాలలో జరిగే ఈ పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. మన దేశంలో ఐదు ప్రదేశాలలో దీపావళి పండుగ మాయాజాలాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ సందర్శించారంటే మరపురాని జ్ఞాపకాలు పొందుతారు.

వారణాసి

దీపావళి సమయంలో గంగా నదీ తీరాన అనేక వేల దీపాలు వెలిగిస్తారు. ఈ అద్భుత దృశ్యం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. కొన్ని లక్షల దీపాలు వెలిగించి అరుదైన రికార్డ్ కూడా సృష్టించారు. సాయంత్రం వేళ గంగా నదికి ఇచ్చే హారతి తిలకించేందుకు అనేక సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు.

అయోధ్య

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. చరిత్ర, సంస్కృతిని ప్రతిబించే విధంగా వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఏడాది దీపావళి వేడుకలు మరింత ప్రత్యేకం కానున్నాయి. ఎందుకంటే సుమారు 500 ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయంలో బాలరాముడు కొలువుదీరాడు.

జైపూర్

పింక్ సిటీగా పేరొందిన జైపూర్ లో దీపావళి సమయంలో ఏర్పాటు చేసే మార్కెట్స్ కనులవిందు చేస్తాయి. సంప్రదాయ వస్తువులు కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. సంప్రదాయకమైన లాంతర్లు, ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడి రాజభవనాలు, కోటలు, ఉద్యానవనాలు రంగు రంగుల విద్యుత్ దీపాల కాంతులతో ధగధగలాడిపోతాయి.

ఉదయ్ పూర్

రాజస్థాన్ లోని మరొక చూడదగ్గ ప్రదేశం ఉదయ్ పూర్. సరస్సులు, రాజభవనాలకు ప్రసిద్ధి చెందింది. దీపావళి సందర్భంగా ఉదయ్ పూర్ లో లైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇందులో ఆటలు, పాటలు, జానపద సంగీతం, ఇతర కార్యకలపాలతో మంచి ఎంజాయ్ మెంట్ ఉంటుంది. నగరంలోని ప్రముఖ ప్రదేశాలన్నీ దీపాలతో అలంకరించి ఉంటారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా ఉంటూ ప్రశాంతమైన వాతావరణం అందిస్తాయి. ఇక్కడ దీపావళి సందర్భంగా ఆకాశంలోకి స్కై ల్యాంప్ వదులుతారు.

కోల్ కతా

కోల్ కతాలో దీపావళి కాళీ పూజతో సమానంగా ఉంటుంది. పెద్ద పెద్ద పాండల్స్ ఏర్పాటు చేసి దీపాలతో అలంకరిస్తారు. హౌరా వంతెనను విద్యుత్ దీపాలు, పూలతో అలంకరిస్తారు. సాంస్కృతిక అనుభవాన్ని ఆస్వాదించాలని అనుకుంటే మీరు ఇక్కడ సందర్శించవచ్చు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు.