భారతదేశంలో ఉన్న అతి ప్రాచీన నగరాలలో వారణాసి ఒకటి. భారతీయులకి ఇది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి, పునర్జన్మ నుంచి కూడా విముక్తులవ్వచ్చని హిందువుల నమ్మకం. కాశీలో చనిపోతే మోక్షం లభిస్తుందని కూడా నమ్ముతారు.
ఇక్కడ ఉన్న విశ్వేశ్వర లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. బౌద్ధులు, జైనులు కూడా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శించుకుంటారు. ఇక్కడ విశ్వేశ్వర ఆలయం, అన్నపూర్ణాలయం, తులసి మానస మందిరం, విశాలాక్షి ఆలయం, వారాహి దేవి ఆలయం, సంకట మోచనాలయం, కాలభైరవ ఆలయం ఇలా ఎన్నో ఆలయాలు ఉన్నాయి.
గంగా నది దక్షిణం నుండి ఉత్తరం వైపు ప్రవహిస్తుంది. కాశీలోకి ప్రవేశించినప్పుడు, దాని ప్రవాహం విల్లు ఆకారంలో ఉంటుంది. దీని కారణంగా గంగ దక్షిణం నుండి తూర్పుకు, ఆ తర్వాత ఈశాన్య దిశ వైపు మారుతుంది. ఈ ప్రదేశం వంపు ఆకారంలో ఉండడం వలన ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో సుడిగుండం ఏర్పడింది. దీనితో గంగాదేవి మణికర్ణిక నుంచి తులసి ఘాట్ దాకా వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది.
పురాణాల ప్రకారం చూసినట్లయితే, శివుడే స్వయంగా వారణాసిని స్థాపించాడు. ఆ స్థలంలో ఆత్మ విముక్తి పొందేలా గంగా ప్రవాహం కూడా శివుని ఆదేశం మేరకు వ్యతిరేక దిశలో ప్రవహిస్తుందని చెబుతారు.
చనిపోయిన వారికి మోక్ష మార్గం అని అంటారు. దహన సంస్కారాలు తర్వాత ఆత్మ గంగా ప్రవాహంలో కలిసి స్వర్గానికి వెళ్తుంది. గంగా నది ప్రవాహం ఇలా ఉండడం వలన, అంత్యక్రియలు చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు.
గంగా నది స్వర్గం నుంచి భూమికి వచ్చినప్పుడు, గంగా ప్రవాహం ఎంతో వేగంగా ఉండేది. ఆ వేగంతో గంగా ప్రవహించినప్పుడు, వారణాసి సమీపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి వున్నారు. గంగా ప్రవాహం వలన ఆయన కమండలం, ఆసనం కూడా కొట్టుకుపోయాయి.
దత్తాత్రేయుడు గంగాదేవిని పిలిచారు. కమండలం, ఆసనాన్ని తిరిగి ఇవ్వమని చెప్పారు. గంగాదేవి పొరపాటుకు క్షమాపణ చెప్పారు. తపస్సుకు గౌరవంగా కమండలాన్ని, ఆసనాన్ని తిరిగి ఇచ్చేశారు. ఆ సమయంలో గంగాదేవి, దత్తాత్రేయుని ఆజ్ఞను గౌరవిస్తూ ప్రవాహ దిశను మార్చుకున్నారు. ఆ తర్వాత వ్యతిరేక దిశలో ప్రవహించడం మొదలుపెట్టింది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.