Mrityunjaya mantram: మృత్యుంజయ మంత్రం అర్థం ఏంటి? దాన్ని పఠించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి?
Mrityunjaya mantram: శివుని అనుగ్రహం పొందాలంటే, మరణ భయం పోగొట్టుకోవాలంటే మహా మృత్యుంజయ మంత్రం పఠించాలని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ సూచించారు. ఈ మంత్రం విశిష్టత గురించి వివరించారు.

భారతీయ సనాతన ధర్మంలో శివారాధనకు చాలా ప్రత్యేకత ఉంది. శివుడు భోళాశంకరుడని, కోరికలను త్వరగా నెరవేరుస్తాడని పురాణాలు తెలియచేస్తున్నాయి. మార్కండేయ పురాణం, శివ పురాణాల ప్రకారం మృత్యువును సైతం తప్పించగలిగేటటువంటి శక్తి శివుడికి ఉందని శాస్త్రాలు తెలియచేస్తున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఏ వ్యక్తి అయినా తన జీవతంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లయితే అలాగే వ్యాధులు, మందులు, ఔషధాల ఖర్చులతో బాధపడుతున్నట్లయితే అటువంటి వారు శివుని మహా మృత్యుంజయ మంత్రాన్ని అనుష్టానం చేసినట్లయితే లేదా జపించినట్లయితే వారికి రోగబాధలు, అనారోగ్య సమస్యలు తొలగుతాయని చిలకమర్తి తెలిపారు.
మహామృత్యుంజయ మంత్రం అనగా ఓం త్రయంబకం అనేటువంటి ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తూ శివుని వద్ద జపం కాని, అభిషేకం గాని చేస్తారో అట్టివారికి శివానుగ్రహం వలన మృత్యువుకు సంబంధించినటువంటి, రోగములకు సంబంధించినటువంటి ఆపదలు తొలగుతాయని చిలకమర్తి తెలిపారు. ఈ మహా మృత్యుంజయ మంత్రం అర్థం త్రయంబకం యజామహే అనగా మూడు కన్నులు కలిగియున్నటువంటి త్రినేత్రుడిని (శివుడు), సుగన్ధిం పుష్టివర్ధనం పరిమళాలు విరజిల్లేటటువంటి పరిమళభరితుడైన, పుష్టివర్ధనుండైన ఉర్వారుకమివ బంధనాన్ అంటే పండిన దోసకాయ పాదునుండి విడిపోయినట్టుగా, మృత్యుర్ ముక్షీయ మామృతాత్ మృత్యు బంధమునుండి నేను విడుదల అగు గాక! (అమృత తత్వమునుండి నేనెప్పుడు దూరమవ్వకుండా ఉండుగాక) ప్రతి ప్రాణికి జనన మరణములు శాశ్వతం. దీని పూర్తి అర్థం మూడు కన్నులు కలిగియున్నటువంటి త్రినేత్రుడిని పరిమళాలు విరజిల్లేటటువంటి పరిమళభరితుడైన, పుష్టివర్ధనుండైన అంటే పండిన దోసకాయ పాదునుండి విడిపోయినట్టుగా మృత్యు బంధమునుండి నేను విడుదల అగు గాక అని అర్ధము.
ఈ విధముగా ఈ శ్లోకాన్ని జపించడం వలన శివుని అనుగ్రహం చేత ఆరోగ్యసిద్ధి, మరియు మరణ సమయంలో సునాయాస మరణం, శివానుగ్రహం కలుగును అని చిలకమర్తి తెలిపారు.