చండేశ్వరుడు' అని శివుని గణాలలో ఒక ముఖ్యుడు. తన నిర్మాల్యంపై అధికారాన్ని ఈయనకు ప్రసాదించాడు శివుడు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అందుకే చండేశ్వరప్రతిష్ఠ ఉన్న శివాలయంలోని ప్రసాదాన్ని, నిర్మాల్యాన్ని గ్రహించరాదంటారు. అయితే కొన్ని శైవాగమాల ప్రకారం, మహానైవేద్యంలో 'చండభాగం' అని విభజిస్తారు. ఆ చోట్ల ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించవచ్చు.
స్ఫటిక, బాణ, స్వయంభూలింగాలున్న గుడిలో చండేశ్వరునికి నిర్మాల్యాధికారం లేదు కనుక- అక్కడ నిర్మాల్య ప్రసాదస్వీకారం చేయవచ్చు. అయితే చండేశ్వరుడున్న ఆలయంలో ప్రదక్షిణ చేసే విధానాన్ని 'చండీప్రదక్షిణం' అంటారు.
సాధారణంగా శివాభిషేక తీర్థం వెలు పలికి వచ్చే సోమసూత్రం వద్ద చండేశ్వర ప్రతిష్ఠ చేస్తారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
1)ఆ సోమసూత్రం నుండి ప్రారంభించి ధ్వజస్తంభం వద్దకు, ధ్వజం నుండి తిరిగి ప్రదక్షిణంగా సోమసూత్రం దగ్గరకు
2) అటు నుంచి వెనక్కి తిరిగి ధ్వజం దగ్గరకు
3)ధ్వజంనుండి ముందుకు సోమసూత్రం దగ్గరకు
4)తిరిగి వెనుకకు ధ్వజం వద్దకు
5)ధ్వజస్తంభంనుండి ముందుకు సోమ సూత్రం దగ్గరకు
6) తిరిగి సోమసూత్రం నుండి వెనుకకు ధ్వజం వద్దకు
7) ధ్వజ స్తంభంనుండి ముందుకు సోమసూత్రం వద్దకు
8)సోమసూత్రం నుండి ధ్వజం దగ్గరకు
9)అటునుంచి శివాలయంలోకి ధ్వజస్తంభపు ఎడమవైపునుండి వెళ్లాలి. దీన్ని చండీప్రదక్షిణం అంటారు.
ఇది నవ ప్రదక్షిణాలతో కూడిన ప్రదక్షిణం. ఇది ఒక్కటి చేస్తే శివునకు ముప్పైవేల ప్రదక్షిణలు చేసినంత పుణ్యం. రెండవ ప్రదక్షిణంలో ధ్వజాన్ని తాకరాదు. రెండు సోమసూత్రాలుంటే ఈ ప్రదక్షిణ పనికిరాదంటారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంబంధిత కథనం