భారతదేశంలోగల ఆలయాల్లో ఎన్నెన్నో విశిష్టతలు, రహస్యాలు దాగున్నాయని, అలాంటి వాటిలో పరిమోత్కృష్టమైనది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలోగల సింహాచల క్షేత్రం ఒకటని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు. సింహాచలేశుని దర్శనం ఆయురారోగ్య ఐశ్వరకరమన్నారు. స్వామి ఆవిర్భావం, ఆలయ నిర్మాణం, సేవలు ఒకటేమిటి ఎన్నెన్నో విచిత్రాలు ఈ ఆలయ చరిత్ర మనకు తెలియజేస్తోందని చిలకమర్తి తెలిపారు.
కృతయుగంలో షట్చక్రవర్తుల్లో ఒకడైన పురూరవుడు తన నెచ్చెలి ఊర్వశితో కలసి విమానంలో గగన విహారం చేస్తుండగా వారి విమానం ముందుకు కదలకుండా గాలిలో ఇక్కడ నిలిచిపోయింది. తర్వాత నెమ్మదిగా అదే ఈ కొండమీదకు దిగిందని.. ఇలా ఎందుకు జరిగిందా అని పురూరవుడు, ఊర్వశి అనుకుంటూ ఆ ప్రాంతమంతా క్షుణ్ణంగా పరిశీలించినా ఏమీ కనిపించలేదు.
అప్పుడు వారిరువురూ అక్కడ నుంచి విమానంలో రాజమందిరానికి వెళ్ళిపోయారన్నారు. ఆ రోజు రాత్రి పురూరవునకు ఒక కల వచ్చిందని, దైవమైన తాను ఓ విగ్రహ రూపంలో దాగున్నానని వెలికి తీసి పూజా పునస్కారాలు నిర్వహించాలని చెప్పినట్టు అయిందన్నారు. మర్నాడు పురూరవుడు పరివారంతో అక్కడకు వచ్చి పుట్టలు, గుట్టలు అన్నీ గాలించగా ఓ విగ్రహం పుట్టలో కూరుకుపోయి కనిపించిందని ఆయన తెలిపారు.
ఆ విగ్రహాన్ని వెలికితీసి అక్కడే ఓ పరిశుభ్ర ప్రదేశంలో ఉంచి పుణ్యాహవచనాది కార్యక్రమాలు నిర్వహించి వెళ్ళిపోయారన్నారు. ఆ రోజు రాత్రి కూడా పురూరవునకు వచ్చిన కలలో స్వామి కన్పించి అక్కడ లభించిన విగ్రహానికి అంటుకొని ఉన్న పుట్టమట్టికి సరిపడినంత చందనాన్ని పూయాలని, దాన్ని ఏడాదికి ఒకసారి ఒలవాలని చెప్పాడన్నారు.
ప్రజలకు తన దర్శనాన్ని ఇప్పించాలని ఆదేశించారన్నారు. అలా స్వామి చెప్పిన రోజు వైశాఖ శుద్ధ తృతీయ కావడంతో ఏటా ఆ విధంగానే స్వామికి చందనోత్సవం నిర్వహిస్తున్నారని చిలకమర్తి తెలిపారు.
ప్రహ్లాద వరదుడైన శ్రీహరి హిరణ్యకశిపుని వధానంతరం ఇక్కడకు వచ్చి విగ్రహ రూపంలో వెలిశాడని, అదే ప్రస్తుతం మనకు చందన ఒలుపు అనంతరం దర్శనమిస్తున్న స్వామి అని వివరించారు. పురూరవుడు ప్రతిష్ఠించిన మూర్తి ఈ స్వామి అడుగున ఉన్నాడని పలువురి భావన అని ఆయన అన్నారు.
మొదటి చందనపూత స్వామి కలలో చెప్పినదాని ప్రకారం పురూరవ చక్రవర్తి వైశాఖ శుద్ధ తృతీయ నాడు ఇక్కడి చందనపు వృక్షాల ముక్కలు తెప్పించి తాను స్వయంగా రాతిబండపై అరగదీసి వేదమంత్రోచ్చరణల మధ్యా స్వామికి చందనం పూసాడని అన్నారు. ఆ సమయంలో 110 మంది రాజనర్తకీమణులు నృత్యం చేశారని, భేరి, కాహళాది వీణ, తంబుర తదితర వాద్యఘోష మిన్నంటినట్టు ఆలయంలో లభించిన శాసనం ద్వారా తెలిసిందని తెలియజేశారు.
హిరణ్యకశిపుని వధానంతరం ఇక్కడకు వచ్చిన స్వామి ఉగ్రంగా తాపంతో ఉన్నాడని, ఆయనను చల్లబరచేందుకు చందన పూత పూశారన్నారు. ఎండలు ఎక్కువగా ఉండే వైశాఖ, జ్యేష్టమాసాలలో స్వామిని చల్లబరచేందుకు చందనపూతలు ఉంటాయన్నారు.
వైశాఖ శుద్ధ తృతీయ (అక్షయ తృతీయ)నాడు స్వామికి చందన ఒలుపు అనంతరం అభిషేక అర్చనాది కార్యక్రమాలు అయ్యాక రాత్రి తొలి విడతగా మూడు మణుగుల చందనాన్ని ఆ మూర్తికి కప్పుతారని ఆధ్యాత్మకవేత్త ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. స్వామి అభిషేకానికి కొండ దిగువన ఉన్న గాంగధార నుంచి వెయ్యి కలశాల్లో జలాలను తీసుకువస్తారని, వాటిలో చందనాన్ని కలిపి స్వామికి అభిషేకిస్తారన్నారు. అలాగే కొబ్బరి నీటిని స్వామి అభిషేకానికి వినియోగిస్తారన్నారు. ప్రతి అభిషేకం అయ్యాక స్వామికి ఒక్కో కర్పూరహారతిని ఇస్తారని తెలిపారు. అనంతరం స్వామికి బాలభోగం (భోజనానికి ముందు అర్పించే ఫలహారం) సమర్పిస్తారన్నారు.
మళ్ళీ వైశాఖ పూర్ణిమ నాడు మరో మూడు మణుగులు, ఆషాఢ, శ్రావణ మాసాల్లోని పూర్ణిమ తిథుల్లో రాత్రి వేళల్లో మూడేసి మణుగులు చొప్పున మొత్తం నాలుగు విడతలుగా స్వామికి చందనం కప్పుతారని ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. ఒక సంవత్సరం పాటు ఉండాల్సిన ఈ చందనం పూతలు బీటలు వారకుండా ఉండేందుకు అర్చక స్వాములు తిరుమణి, శ్రీ చూర్ణం కలిపి బీటలు వచ్చిన చోట రాసి బీటలు అతుక్కునేలా చేస్తారన్నారు. దీనినే కరాళ చందన సమర్పణ అంటారని ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.
సింహాచలేశుని సన్నిధిలో అన్నీ సంప్రదాయ బద్ధంగా, ఆరోగ్య ప్రదానంగా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కట్టెలపొయ్యిపై కొర్రల బియ్యంతో చేసిన పాయసాన్ని స్వామినికి నివేదిస్తారన్నారు. గిరి ప్రదక్షిణ జరిగే క్రమంలో కొండపైగల ఆరోగ్యప్రదాయనులైన వృక్షాలు (పనస, అనాస, కరక్కాయ, తానికాయ, ఉసిరి (త్రిఫలాల) మీదుగా వచ్చే గాలులు భక్తులకు ఆరోగ్యాన్ని కలగజేస్తాయని తెలిపారు.