Pitru Paksha । జీవితంలో ఏ వ్యక్తి కూడా ఈ మూడు రుణాలను కలిగి ఉండరాదు!
Pitru Paksha: పితృదేవతల ఆరాధన విస్మరించకూడదు, పితృ దేవతల రుణం ఎప్పటికీ శేషంగా ఉంచుకోకూడదు. భాద్రపద మాస పితృ పక్షాల ప్రాముఖ్యత గురించి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరంగా తెలియజేశారు. ఈ కథ చదవండి.
భాద్రపద మాసం చాలా విశేషమైనటువంటి మాసం. ఈ మాసంలో మొదటి 15 రోజులు దేవతారాధనలకు (విఘ్నేశ్వరాధనకు), ఆఖరి 15 రోజులు పితృదేవతల ఆరాధనకు ప్రాధాన్యత కలదు. భాద్రపద మాసంలో గణపతి ఆరాధన చాలా విశేషము. వినాయకుని జననం జరగడం, వినాయక చవితి 9 రోజులు జరుపుకోవడం ఈ మాసం ప్రత్యేకత.

పురాణాల ప్రకారం ఏ వ్యక్తి అయినా తన జీవితంలో మూడు ఋణాలు కచ్చితంగా తీర్చుకోవాలి. అందులో మొదటిది దైవ ఋణం, రెండోది ఋషి (గురువు) ఋణం కాగా, మూడవది పితృ ఋణం. సనాతన ధర్మం ప్రకారం దేవతల ఆరాధనకు ఎంత ఫలితం లభిస్తుందో, దానికంటే 10 రెట్లు పుణ్యఫలం భాద్రపద మాసంలో చేసేటువంటి పితృ దేవతల ఆరాధనకు వస్తుంది.
పితృ దేవతలు ఎవరు?
పితృ దేవతలు అనగా మన 7 తరాలలో గతించినటువంటి తల్లిదండ్రులు, తాతముత్తాతలు, బంధువులు అలాగే గురువులు. వీరి కోసం వదిలేటటువంటి తర్పణాలు, శ్రాద్ధకర్మలు, చేసేటువంటి దానాలు పితృ దేవత ఆరాధనలో భాగం. ఏ వ్యక్తి అయినా సరే, చనిపోయిన వారికి సంవత్సరానికి ఒకసారైనా వారు గతించిన తిథి రోజున శ్రాద్ధకర్మలు నిర్వర్తించాలి.
ఒకవేళ అలా శ్రాద్ధకర్మలు ఆ సంవత్సరంలో ఆ తిథి యందు జరపలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు భాద్రపదమాసంలో కృష్ణపక్షం (Pitru Paksha) లో వచ్చేటువంటి తిథియందు నిర్వహించుకోవచ్చు. ఈ రకంగానూ శ్రాద్ధకర్మల ఫలితం లభించును. ఇలా కూడా చేయడం కుదరలేనటువంటి వారు భాద్రపదమాసంలో పితృ పక్షంలో కృష్ణపక్షం చతుర్దశి, మహాలయ అమావాస్య నాడు నిర్వహిస్తే వారికి పితృదేవతల శ్రాద్ధ ఫలం లభించును.
యుద్ధంలో చనిపోయినటువంటి వారికి, యాత్రలో చనిపోయినటువంటివారికి, అలాగే ప్రయాణములలో యాక్సిడెంటులలో చనిపోయిన వారికి, కరోనా వంటి మహమ్మారితో చనిపోయినటువంటి వారికి, ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వారికి భాద్రపద మాసంలో వచ్చేటువంటి పితృ పక్షంలో , మహాలయ అమావాస్య వారికి శ్రాద్ధకర్మ నిర్వర్తించడానికి ఉత్తమమైనటువంటి సమయము.
పితృ రుణం ఉంచుకోవడం మంచిది కాదు
పితృ ఋణాలు ఏ వ్యక్తి అయినా ఉంచుకోకూడదని శాస్త్ర వచనము. పితృ ఋణాలు కనుక అశేషంగా మిగిలినట్లయితే, వారి ఇంట్లో మానసిక అశాంతి, కుటుంబంలో గొడవలు, ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పూర్వీకులు తెలియజేసారు. నేటి సమాజంలో శ్రాద్ధ కర్మలను, పితృ ఋణాలను తెలుసుకోలేనటువంటి స్థితిలో యువతరం ఉన్నది. పితృదేవతారాధన సవ్యంగా చేసినటువంటి వారికి అనగా గతించినటువంటి తల్లి దండ్రులు, తాతముత్తాతలుకు శ్రాద్ధకర్మలు చేసి తర్పణాలు విడిచి పెట్టినటువంటి వారికి పితృ దేవతల ఆశీస్సులతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. సుఖసౌఖ్యములు అనుభవిస్తారని పురాణాలు తెలియజేశాయి.
ఏ మానవుడైనా భాద్రపద మాసంలో పితృపక్షాలలో ఈ మూడు తప్పకుండా ఆచరించాలి. 1 గతించినటువంటి వారికి తర్పణాలు వదలడం. 2. శ్రాద్ధకర్మలు నిర్వర్తించడం అలాగే అన్నదానం చేయడం. 3. భాద్రపదమాసంలో గోవులకు ఆహారం పెట్టడం, గోవులకు విశేషంగా బియ్యం, బెల్లం తినిపించడం. ఇలా చేయడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు పొందుతారని శాస్త్రం తెలుపుతుంది.
- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.
సంబంధిత కథనం