Nirjala Ekadashi 2023: నిర్జల ఏకాదశి.. వ్రత కథ, నియమాలు ఇవే-nirjala ekadashi 2023 date know vratha katha puja rituals fasting rules here ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Nirjala Ekadashi 2023 Date Know Vratha Katha Puja Rituals Fasting Rules Here

Nirjala Ekadashi 2023: నిర్జల ఏకాదశి.. వ్రత కథ, నియమాలు ఇవే

HT Telugu Desk HT Telugu
May 31, 2023 07:09 AM IST

నిర్జల ఏకాదశి ఈ ఏడాది మే 31న బుధవారం వస్తోంది. ఏకాదశి సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం వరకు ఈ ఏకాదశి ఉపవాసం ఆచరించాలి.

నిర్జల ఏకాదశి రోజున శ్రీ హరిని పూజించాలని ఆధ్యాత్మిక వేత్తల సూచన
నిర్జల ఏకాదశి రోజున శ్రీ హరిని పూజించాలని ఆధ్యాత్మిక వేత్తల సూచన

నిర్జల ఏకాదశి, ఏకాదశి వ్రతం గురించి ఓ సారి ప్రవచనంలో ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు ఇలా చెప్పారు. ‘ఈశ్వరుడిని చేరుకోవడానికి ఉన్న మార్గం ఏకాదశి వ్రతం. ఇది అంత సులువు కాదు. అత్యంత కష్టమైనది. ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా? ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడమే కాదు. పచన ప్రయత్నం చేయకూడదు. అంటే ఆ సమయంలో రేపటి తిండి గురించో, లేక రేపటి ఆహారం వండుకునేందుకు అవసరమైన పదార్థాల గురించి స్మరించుకోవడమో, సిద్ధం చేసుకోవడమో వంటివి చేయకూడదు. అసలు శరీర పోషణకు కావాల్సిన ఏ పనీ చేయకూడదు..’ అని వివరించారు. ఇక నిర్జల ఏకాదశి రోజు నీరు తాగకూడదు. ఉమ్ము మింగకూడదు.

ట్రెండింగ్ వార్తలు

‘అకస్మాత్తుగా, అనాయాసంగా శరీరం విడిచివెళ్లిపోవడం అందరికీ సాధ్యం కాదు. అందరికీ పట్టే భాగ్యం కాదు. అయితే చాలా మందికి అంత్యదశలో నీరు ఇవ్వరు. అన్నం పెట్టరు. ఆసుపత్రిలో గొట్టం ద్వారా వెళ్లేదే ఆహారమే. తినలేడు. తాగలేడు. బయటకు వెళ్లలేడు. తింటే తప్ప నిద్ర పట్టని అలవాటు.

ఇవన్నీ లేకుండా ఈశ్వర నామస్మరణ చేయమంటే ఎలా? ఎంత క్లేశం? ప్రతి పక్షంలోనూ ఏకాదశి వ్రత ఉపవాస దీక్ష చేస్తే అది అలవాటైపోతుంది. ఈశ్వరుడినే స్మరిస్తూ ఉండడం అలవాటైపోతుంది. ఇక చివరి రోజు వచ్చినప్పుడు చివరి శ్వాసలోనూ ఈశ్వరుడి స్మరణ ఉంటుంది. ఏకాదశి వ్రతానికి ప్రధాన ప్రయోజనం ఏంటంటే.. మృత్యువు వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో.. ఆ తర్ఫీదు ఇవ్వడమే..’ అని చాగంటి ప్రవచించారు.

8 ఏళ్లలోపు వారికి, 80 ఏళ్ల లోపు వారికి ఉపవాసం నిషేధం. అలాగే వైద్యపరంగా ఆహారం అవసరమైన షుగర్ పేషెంట్లు తదితరులకు ఆహార ఆంక్షలు ఏవీ ఉండవని చాగంటి వివరించారు.

నిర్జల ఏకాదశి వ్రత కథ

ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పొందడానికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పాండవులందరికీ వేదవ్యాస మహర్షి సంకల్పించాడు. ఇప్పుడు మాతా కుంతీ, ద్రౌపదితో సహా అందరూ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. కానీ ఆకలికి తట్టుకోలని భీముడు నెలలో రెండు రోజులు ఉపవాసం ఉండటం చాలా కష్టమని భావిస్తాడు. వ్యాస మహర్షిని పరిష్కారం కోరుతాడు. దీనికి వ్యాసుడు స్పందిస్తూ నిర్జల ఏకాదశి ఉపవాసం గురించి చెబుతాడు.

ఈ ఒక్క ఉపవాసం చేస్తే ఏడాది పొడవునా మిగిలిన అన్ని ఏకాదశులకు ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుందని ఉపదేశిస్తాడు. జ్యేష్ఠ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి ఉపవాసం ఉండాలని, నీళ్లు కూడా తాగరాదని సూచిస్తాడు. సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఇలా కఠోర ఉపవాస దీక్ష ఉండాలని సూచిస్తాడు. మరుసటి రోజు స్నానమాచరించి దానధర్మాలు చేయాలి. ఆ తర్వాత స్వయంగా శ్రీవిష్ణుమూర్తిని పూజించాలని సూచిస్తాడు. భీముడు అలా నిర్జల ఏకాదశి ఉపవాసం చేస్తాడు. అందుకే దీనికి భీమసేని ఏకాదశి అనికూడా అంటారు.

ఈ ఏడాది మే 31న బుధవారం ఈ నిర్జల ఏకాదశి వస్తోంది. సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం వరకు ఈ ఏకాదశి ఉపవాసం ఆచరించాలి.

WhatsApp channel