Vemulawada Temple : కోడెను రాజన్నకు సమర్పిస్తే కోరుకున్నవి జరుగుతాయట-heres story of vemulawada rajanna temple ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Here's Story Of Vemulawada Rajanna Temple

Vemulawada Temple : కోడెను రాజన్నకు సమర్పిస్తే కోరుకున్నవి జరుగుతాయట

HT Telugu Desk HT Telugu
Feb 07, 2023 02:56 PM IST

Maha Shivaratri 2023 : మహాశివరాత్రి వస్తోంది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. భక్తిశ్రద్ధలతో పరమాత్ముడిని కొలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగిపోతాయి. వేములవాడ రాజన్న సన్నిధిలోనూ భక్తులు కిటకిటలాడుతారు.

వేములవాడ ఆలయం
వేములవాడ ఆలయం (twitter)

దక్షిణకాశిగా పేరొందిన వేములవాడ క్షేత్రానికి ఎంతో చరిత్ర ఉంది. కొన్ని వందల ఏళ్లుగా రాజరాజేశ్వరుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. శివరాత్రి సందర్భంగా.. ఇక్కడకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ప్రాచీన కాలానికి సంబంధించి.. సంస్కృతి-సంప్రదాయాలు, ఆచారాలు, కళలు ఉట్టిపడేలా ఉన్న నిర్మాణాల్లో ఈ ఆలయం ఒకటి. చాళక్యులు వైభవంగా నిర్మించిన ఈ క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనది.

ట్రెండింగ్ వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ(Vemulawada) రాజరాజేశ్వరుడు కొలువుదీరాడు. కరీంనగర్ నుంచి 40-50 కిలోమీటర్లు. హైదరాబాద్(Hyderabad) నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. ఈ శైవక్షేత్రం మహాశివరాత్రి సందర్భంగా.. శివనామస్మరణతో మారుమోగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడకు భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. శివరాత్రికి ఆలయానికి చేరుకుని జాగారం చేస్తుంటారు.

రాజరాజేశ్వరుడు కొలువుదీరిన వేములవాడను దర్శించుకుంటే సర్వ దోషాలు పోతాయని భక్తులు నమ్ముతుంటారు. భోగభాగ్యాలకు నిలయమైన సుక్షేత్రాలను వెదుకుతూ పరమశివుడు భూలోకంలో తన నిత్య నివాసానికి వేములవాడ(Vemulawada)ను ఎంచుకున్నాడని పురాణ కథనం చెబుతోంది. రాజరాజేశ్వరుడిగా శివయ్య కొలువుదీరితే, మహిషాసురుణ్ని ఇదే ప్రాంతంలో సంహరించిన ఆదిశక్తి రాజేశ్వరిగా నిలిచిందని అంటారు. సమస్త దేవతలు సైతం అమ్మవారిని అభిషేకిస్తే.. ఆ జలంతో సకల తీర్థాల సంగమంగా ధర్మగుండం పుష్కరిణి వెలిసిందట.

వేములవాడ రాజన్న(Vemulawada Rajanna) అనగానే మెుదటగా గుర్తుకొచ్చేది కోడె మొక్కులు. కోడెలను రాజన్నకు సమర్పిస్తే కోరుకున్నవి జరుగుతాయని నమ్మకం. భక్తులు కోడెలను తీసుకొచ్చి.. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. గుడి ప్రాంగణంలో కట్టేస్తారు. దేవాలయానికి దక్షిణగా ఇస్తారన్నమాట. దీని వల్ల సంతానప్రాప్తి కలుగుతుందని కూడా నమ్ముతారు.

వేములవాడ గ్రామం.. పురాతనకాలం నుంచి ఉంది. పశ్చిమ చాళుక్యుల కాలంలో రాజరాజేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట గాని, లేదా అతడు కట్టించిన కారణంగా ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని చెబుతారు.

వేములవాడ రాజన్న సన్నిధికి సంబంధించి పురాణాల్లో కథ ఉంది. వృత్రాసురిని చంపిన ఇంద్రుడు బ్రహ్మ హత్యదోషం నివారించుకోవడానికి పుణ్యక్షేత్రాలకు తిరిగాడట. ఎక్కడకు వెళ్లినా కూడా దోష నివారణ జరగలేదని చివరకు బృహస్పతి సూచనతో వేములవాడలోని రాజేరాజేశ్వర స్వామిని దర్శించుకున్నాడని అంటారు. ఇక్కడకు రావడంతోనే ఇంద్రుడికి దోష పరిహారం లభించిందట. బద్ధి పోచమ్మ, సోమేశ్వర, భీమేశ్వర, విఠలేశ్వర ఆలయాలు సైతం వేములవాడలో ఉన్నాయి.

WhatsApp channel