ఛార్ ధామ్ యాత్ర 2025: కేదార్‌నాథ్ డోలి యాత్ర అంటే ఏంటి? దీని ప్రాముఖ్యత తెలుసుకోండి!-chardham yatra 2025 do you know what doli yatra is check its importance as well ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఛార్ ధామ్ యాత్ర 2025: కేదార్‌నాథ్ డోలి యాత్ర అంటే ఏంటి? దీని ప్రాముఖ్యత తెలుసుకోండి!

ఛార్ ధామ్ యాత్ర 2025: కేదార్‌నాథ్ డోలి యాత్ర అంటే ఏంటి? దీని ప్రాముఖ్యత తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఒకటి. మే 2 నుంచి కేదార్‌నాథ్‌ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల పాటు భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి పరమేశ్వరుడిని దర్శించుకుంటారు. కేదార్‌నాథ్ డోలి యాత్ర అంటే ఏంటి, దీని ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

కేదార్‌నాథ్ డోలి యాత్ర అంటే ఏంటి? (pinterest)

ఇప్పటికే చాలా మంది భక్తులు చార్ ధామ్ యాత్రను మొదలుపెట్టారు. నాలుగు తీర్థక్షేత్రాలు తలుపులు తెరుచుకున్నాయి. 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఒకటి. మే 2 నుంచి కేదార్‌నాథ్‌ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల పాటు భక్తులు దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ఆలయ తలుపులు మూసి వేస్తారు.

ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి పరమేశ్వరుడిని దర్శించుకుంటారు. ఇక్కడికి వెళ్లి శివుడిని దర్శనం చేసుకుంటే దుఃఖాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. డోలి ఉత్సవం గురించి చాలామందికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డోలి ఉత్సవాలు

కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు తెరవడానికి ముందు పలు సంప్రదాయాలని పాటించడం జరుగుతుంది. బాబా భైరవనాధ్ ని మొదట పూజిస్తారు. ఆ తర్వాత ఆ పంచముఖి డోలిని ఉఖిమఠ్ నుండి కేదార్‌నాథ్‌ వరకు తీసుకెళ్తారు. ఆ తర్వాత రోజు కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు తెరుస్తారు.

పంచముఖి డోలి

ఈ డోలికి మొత్తం ఐదు ముఖాలు ఉండడం వలన పంచముఖి డోలి అని అంటారు. ఆలయ తలుపుల్ని మళ్ళీ మూసివేసినప్పుడు కేదార్‌నాథ్‌ విగ్రహం ఆరు నెలల పాటు గడ్డి స్థల్ ఓంకారేశ్వరుని ఆలయంలో ఉంచుతారు. ఈ పల్లకిలో కేదార్నాథ్ వెండి విగ్రహం ఉంచడం జరుగుతుంది. ఈ పంచముఖ డోలిని ఓంకారేశ్వరుని ఆలయానికి తీసుకువెళ్తారు.

ఆ తర్వాత ఆలయ తలుపులు తెరిచేటప్పుడు కేదార్నాథ్ విగ్రహాన్ని ఆ డోలిలో కేదార్‌నాథ్‌ ఆలయానికి తీసుకువెళ్లడం జరుగుతుంది. కేదార్‌నాథ్‌ ధామ్ లో ఆరు నెలల పాటు ఈ విగ్రహాన్ని పూజిస్తారు. ఆ తర్వాత ఆలయం మూసివేసినప్పుడు ఓంకారేశ్వరాలయంలో ఆరు నెలలు పూజిస్తారు.

నాలుగు ధామ్లు

ఉత్తరాఖండ్లో ఉన్న ఈ నాలుగు ధామ్లను చూడడానికి చాలా మంది భక్తులు వస్తారు. మొదట యమునోత్రి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత గంగోత్రి సందర్శిస్తారు. చివరగా కేదార్‌నాథ్‌, బద్రీనాథ్ ఆలయాలను సందర్శిస్తారు. కేదార్‌నాథ్‌ ధామ్ తలుపులు మే 2న తెరుచుకోగా, బద్రీనాథ్ తలుపులు మే 4న తెరుచుకున్నాయి.

కేదార్నాథ్ శివలింగం

కేదార్నాథ్ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. సహజమైన రాతి నిర్మాణంతోనే ఇది ఉంటుంది. 3.6 మీటర్ల ఎత్తు, 5.7 మీటర్ల చుట్టుకొలతతో ఈ విగ్రహం ఉంటుంది. శివుని రూపంగా భక్తులు దీనిని పూజిస్తారు.

ఆలయ చరిత్ర

కేదార్నాథ్ ఆలయం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను కూడా ఎదుర్కోవడం జరిగింది. సుమారు నాలుగు శతాబ్దాల క్రితం 400 ఏళ్ల పాటు మంచులో కూరుకుపోయింది అని ఆలయ చరిత్ర చెబుతోంది. 20వ శతాబ్దం ప్రారంభంలో కొంత మంది అన్వేషకులు మంచును తొలగించడం వలన ఆలయం బయటపడిందట. అన్ని ఏళ్ల పాటు మంచులో కూరుకుపోయినా ఆలయానికి మాత్రం ఏమీ కాలేదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.