Garuda Puranam: గరుడ పురాణం చెప్పినట్లు, ఈ అలవాట్లుంటే కోటీశ్వరుడైనా నిరుపేద కావాల్సిందే!-according to garuda purana these five habits make millionaire to poor man ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Garuda Puranam: గరుడ పురాణం చెప్పినట్లు, ఈ అలవాట్లుంటే కోటీశ్వరుడైనా నిరుపేద కావాల్సిందే!

Garuda Puranam: గరుడ పురాణం చెప్పినట్లు, ఈ అలవాట్లుంటే కోటీశ్వరుడైనా నిరుపేద కావాల్సిందే!

Ramya Sri Marka HT Telugu

Garuda Puranam: వీలుకు తగ్గట్లుగా పని చేసుకుంటూ పోతే ఇబ్బందులు తప్పవు. చేసే ప్రతి పని పురాణాలను, ధర్మాన్ని అనుసరించి నిర్వర్తిస్తేనే మంచిది. అలా కాకుండా యథేచ్ఛగా వ్యవహరిస్తే దరిద్రాన్ని ఆహ్వానించినట్టే. గురుడ పురాణం ప్రకారం ఈ అయిదు పనులు చేసిన వారు కోటీశ్వరుడైనా చివరికి నిరుపేద అవుతాడట!

గరుడ పురాణం చెప్పినట్లు, ఈ అలవాట్లుంటే కోటీశ్వరుడైనా నిరుపేద కావాల్సిందే!

దైనందిక జీవితంలో మీరు ఈ అయిదు అలవాట్లను కచ్చితంగా అవలంభిస్తుంటే వెంటనే వాటిని వదిలేయండి. గరుడ పురాణం ప్రకారం, ఈ అలవాట్లు ఎంతటి కోటీశ్వరుడినైనా పేదరికంలోకి నెట్టేస్తాయట. ఆ అలవాట్లు తెలుసుకునే ముందు అసలు గరుడ పురాణమంటే ఏమిటి.. ఎందుకు అలా జరుగుతుందో తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ఉన్న 18 పురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఈ పురాణాలన్నీ మనిషి జీవనశైలి సక్రమంగా ఎలా ఉండాలో తెలియజెప్పేవే. మన జీవితాన్ని మరింత అర్థం చేసుకోవడానికి ఈ పురాణంలో చెప్పిన నియమాలను ఉపయోగించుకోవచ్చు.

ఇది హిందూ మత మౌలిక సూత్రాన్ని, తత్వశాస్త్రాన్ని వివరిస్తుంది. దేవతలు కేవలం ఆలయాల్లోనే కాదు శరీరంలో, సమాజంలో ప్రతి చోటా కొలువై ఉన్నారని చెప్తుంది. పేరుకు తగ్గట్లుగా ఈ పురాణం గరుడ, శ్రీ విష్ణువుల మధ్య సంభాషణను వివరించేదిగా ఉండదు. జీవితం, మరణాంతర పరిణామాల గురించిన రహస్యాలను వెలికితీస్తుంది. పునర్జన్మ, మనుష్య ఆత్మలు, నరకం, భయంకరమైన శిక్షల గురించి సమాచారం అందిస్తుంది. వీటితో పాటుగా జీవితం సంపూర్ణంగా గడపడానికి, సరైన మార్గాన్ని అనుసరించడానికి ఎలా జీవించాలో కూడా ఈ పురాణంలో వివరించబడింది.

శ్రీ మహావిష్ణువు గరుడ పురాణంలో మనుషులు కచ్చితంగా విడిచిపెట్టాల్సిన ఐదు అలవాట్ల గురించి వివరించారు. పెడచెవిన పెట్టి ఈ అలవాట్లను పాటిస్తే పేదరికంలోకి కచ్చితంగా వెళ్లిపోవాల్సిందే.

ఈ అలవాట్లను వెంటనే విడిచిపెట్టండి!

ఆధునిక సమాజంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డ చాలా మంది రాత్రుళ్లు ఆలస్యంగా పడుకొని, ఉదయం సమయంలో ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. శాస్త్రాల ప్రకారం, ఉదయం ఆలస్యంగా లేవడం అనేది ఒక ప్రతికూల అలవాటుగా చెప్పబడింది. ఉదయం ఆలస్యంగా లేచేవారు స్తబ్దుగా ఉంటారు. జీవితంలో ఎప్పుడూ పురోగతి సాధించలేరు. ఎందుకంటే అలసత్వం అనేది జీవితంలో రాబోయే పురోగతిని బలవంతంగా అడ్డుకుంటుంది. పురోగతి లేనివారు ఆర్థిక కష్టాలను తప్పక ఎదుర్కోవాల్సి వస్తుంది.

గరుడ పురాణం ప్రకారం, మీరు రాత్రి బంగారం పడుకునే ముందు తినేసిన ప్లేట్లు లేదా ఖాళీ అయిపోయిన వంట పాత్రలను వంటగదిలో అలాగే ఉంచి నిద్రకు ఉపక్రమించరాదు. మీరు ఇలా చేస్తే శని గ్రహం ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, లక్ష్మీ దేవి ఆగ్రహంగా ఉండి ఇంట్లోకి ప్రవేశించదు. రాత్రి పడుకునే ముందు ఆ పాత్రలను శుభ్రం చేయడం చాలా అవసరం.

మురికిగా ఉండటం, మాసిపోయిన వస్త్రాలు ధరించడం లక్ష్మీ దేవికి నచ్చని విషయం. ఎందుకంటే లక్ష్మీ దేవి శుద్ధి, పవిత్రతతో ఉండే ప్రదేశాల్లో నివసిస్తారు. ఉదయం సమయంలో స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవడం మంచి ఆచారం. మీరు ఇలా చేస్తే లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయని గరుడ పురాణం చెప్తుంది.

దురాశతోనూ స్వయంగా సంపాదించాలనే ఆలోచనను వీడిన కొందరు దుర్మార్గపు బుద్ధిని ప్రదర్శిస్తుంటారు. ఎల్లప్పుడూ ఇతరుల సంపద లేదా ఆస్తిని దోచుకోవాలని ఆలోచిస్తుంటారు. ఈ ప్రవర్తన మూలంగా లక్ష్మీ దేవి వారిపై ఎప్పుడూ ఆగ్రహంగా ఉంటుంది. వారి కోసం నిజమైన ఆనందం లభించదు. మరొకరి కష్టాన్ని చూసి, తాము కష్టపడాలని భావించిన వారికే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలా సంపాదించేటప్పుడు మాత్రమే సంతోషంగా ఉండగలమని గరుడ పురాణం పేర్కొంది.

వీటితోపాటుగా గరుడ పురాణంలో చెప్పినట్లుగా, ఇతరులకు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ హాని తలపెట్టాలని భావించిన వారిని కూడా లక్ష్మీ దేవి నిందిస్తారు. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ డబ్బు కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో అతి కోపంగానూ, కారణం లేకుండానే ఆవేశపడుతుండటం లాంటి భావాలకు గురవుతుంటారు. ఈ పరిస్థితుల ప్రభావం పేదరికానికి దారి తీస్తుందని గరుడ పురాణం చెప్తుంది. ఎందుకంటే లక్ష్మీ దేవి ఇలాంటి పరిస్థితులలో ఎప్పుడూ ప్రవేశించరు.