(1 / 9)
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 14వ తేదీ నుంచి కొత్త కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
(2 / 9)
కొత్త రేషన్ కార్డుల మంజూరులో భాగంగా…. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 4.76 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా మొత్తం 11.30 లక్షల మందికి ప్రయోజనం కలగనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వీరందరికి కార్డులు రానున్నాయి.
(3 / 9)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత…రేషన్ కార్డులపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వాలని కూడా నిర్ణయించింది.
కొత్త కార్డులతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్కార్డులను అందించే దిశగా పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది.
(4 / 9)
స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ టెండర్లను కూడా ఆహ్వానించింది. పలు సంస్ఖలు టెండర్లు కూడా దాఖలు చేశాయి. అర్హత సాధించిన వారికి కార్డుల ముద్రణ బాధ్యతలు అప్పగిస్తారు. అయితే ఈ ప్రక్రియలో ఓ సంస్థ… కోర్టును ఆశ్రయించటంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
(5 / 9)
ఈ నెల 14వ తేదీన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత…. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా నిర్వహించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా కొత్త కార్డులను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. పంపిణీ చేసే తేదీలతో పాటు ప్రాంతాలను స్థానిక అధికారులు ప్రకటిస్తారు. ఆ తేదీలకు అనుగుణంగా…. లబ్ధిదారులు వారి రేషన్ కార్డులను తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం స్మార్ట్ కార్డుల రూపంలో కాకుండా… పేపర్ రూపంలోనే కొత్త రేషన్ కార్డులను అందజేయనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత… కార్డుల ముద్రణ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత… స్మార్ట్ కార్డులను అందజేస్తారు. ప్రస్తుతానికి అయితే పేపర్ రూపంలోనే కార్డును తీసుకుంటారు.
(6 / 9)
త్వరలోనే అందించబోయే స్మార్ట్ రేషన్ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. కొత్త కార్డులపై కుటుంబ పెద్ద పేరు మినహా ఎవరి ఫొటోలు ఉండే అవకాశం లేదు. ఏటీఎమ్ కార్డు సైజులో ఉంటుందని తెలుస్తోంది.
(7 / 9)
ఏటీఎం రూపంలో ఉండే స్మార్ రేషన్ కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో ఉంటుందని సమాచారం. కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్, కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్ కోడ్ ముద్రిస్తారని తెలుస్తోంది. మరోవైపు జిల్లా పేరు, మండలం, గ్రామం, క్యూ ఆర్ కోడ్, రేషన్ కార్డుదారుడి చిరునామా ఉండేలా రూపొందిస్తారని సమాచారం. త్వరలోనే ఈ స్మార్ట్ రేషన్ కార్డును ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. దీనిపై పౌరసరఫరాల శాఖ ప్రకటన చేయాల్సి ఉంది.
(8 / 9)
ఇప్పటి వరకు మంజూరైన కొత్త కార్డులతో పాటు కుటుంబ సభ్యుల జోడింపు వివరాలను పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ (https://epds.telangana.gov.in/FoodSecurityAct/) ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు నెంబర్ లేదా మీసేవలో దరఖాస్తు చేసుకున్న సమయంలో జనరేట్ అయ్యే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్సైట్లో కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు చూపిస్తాయి. అధికారిక వెబ్సైట్ లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.
(9 / 9)
మరోవైపు రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తున్నారు. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రేషన్ బియ్యం తీసుకునేందుకు ఎక్కువ మంది లబ్ధిదారులు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా కొత్త కార్డుల మంజూరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు