(1 / 6)
ప్రస్తుతం రోడ్ సైడ్ కొనుగోలు చేసి తాగే జ్యూస్ల్లో నాణ్యత కొరవడుతోంది. ప్రధాన నగరాలు, పట్టణాల్లో వేలాది తోపుడు బండ్లపై వ్యాపారులు కూల్ డ్రింక్స్ విక్రయిస్తుంటారు. వీటిల్లో చల్లదనం కోసం ఐస్ ముక్కలు వేస్తారు. ఈ ఐస్పై పర్యవేక్షణ లేదు. ఇది అనారోగ్య సమస్యలకు కారణం అవుతోంది.
(unsplash)(2 / 6)
తెలంగాణలో చాలాచోట్ల ఐస్ తయారీ వ్యాపారులు క్వింటా రూ.500 నుంచి రూ.600లకే విక్రయిస్తున్నారు. తోపుడు బండ్ల వ్యాపారులు తక్కువ ధరకే లభించే ఐస్ ముక్కల్ని 20 నుంచి 30 కిలోలు కొనుగోలు చేసి వాడుతున్నారు. ఈ ఐస్ తయారీకి నీళ్లు స్వచ్ఛమైనవి వాడటం లేదు. చాలా సందర్భాల్లో ఐస్ గడ్డల్లో రాళ్లు, ఇనుప ముక్కలు, చెక్క వచ్చిన సందర్భాలున్నాయని.. చిరు వ్యాపారులు చెబుతున్నారు.
(unsplash)(3 / 6)
కలుషితమైన ఐస్ను జ్యూస్లలో కలపడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. కడుపునొప్పి, విరేచనాలు, గొంతునొప్పి తదితర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. ప్రతి వేసవి కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఈ తరహా సమస్యలతో సంప్రదించేవారు దాదాపుగా 10 వేల మంది ఉంటారని వైద్యులు చెబుతున్నారు.
(unsplash)(4 / 6)
పట్టణాల్లో పురపాలక అధికారులు, గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది జ్యూస్ కేంద్రాలను పరిశీలించాలి. తాజా పండ్లు, పరిశుద్ధమైన నీటిని వినియోగిస్తున్నారో లేదో చూడాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఐస్ ఫ్యాక్టరీలు వినియోగిస్తున్న నీరు ఎక్కడిది.. శుద్ధమైనదేనా పరిశీలించాలి. కానీ ఎక్కడా ఇలాంటి తనిఖీలు కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
(unsplash)(5 / 6)
నాణ్యత లేని ఐస్ వల్ల గొంతునొప్పి, జలుబు, దగ్గు సమస్యలు వస్తాయని.. రోజుకు సగటున అయిదారుగురు పిల్లలు ఈ సమస్యతో ఆస్పత్రికి వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. నిల్వ నీటితో ఐస్ను చేయడం వల్ల.. కడుపులోకి క్రిములు చేరి అనారోగ్యానికి కారణమవుతోంది.
(unsplash)(6 / 6)
ముఖ్యంగా దంత సమస్యలు పెరగడానికి కూడా నాణ్యత లేని ఐస్ కారణమవుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. జ్యూస్ కేంద్రాల్లో ఐస్తోపాటు పండ్లు కూడా తాజావి, మంచివి వినియోగిస్తున్నారో లేదో పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. ముందే తయారు చేసిన డ్రింక్ తాగకుండా.. తాజా ముక్కలతో తయారు చేయించుకుని తాగాలని స్పష్టం చేస్తున్నారు.
(unsplash)ఇతర గ్యాలరీలు