అత్యంత ధైర్యసాహాసాలను ప్రదర్శిస్తూ.. తోటి సైనికుడిని కాపాడే క్రమంలో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. సిక్కింలో గురువారం జరిగింది ఈ ఘటన. నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న ఓ సైనికుడిని సాహసోపేతంగా రక్షించిన లెఫ్టినెంట్ శశాంక్ తివారీ.. తన ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయారు! లెఫ్టినెంట్ శశాంక్ తివారీ వయస్సు 23ఏళ్లు.
గతేడాది డిసెంబర్లో సిక్కిం స్కౌట్స్లో చేరారు 23ఏళ్ల లెఫ్టినెంట్ శశాంక్ తివారీ. సిక్కింలోని ఓ ఆపరేటింగ్ బేస్కి తన టీమ్తో గురువారం బయలుదేరారు. అక్కడ ఒక్క పోస్టు రెడీ అవుతోంది. ప్రతికూల పరిస్థితుల మధ్య అగ్నివీర్ స్టీఫెన్ సుబ్బా అనే సైనికుడు కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అది గమనించిన లెఫ్టినెంట్ తివారీ.. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే నీటి ప్రవాహంలోకి దూకేశారు. మరో జవాను నాయక్ పుకార్ పటేల్ సైతం మద్దతుగా నిలిచాడు. ఇద్దరు కలిసి అగ్నివీర్ని రక్షించగలిగారు.
అయితే ప్రమాదం నుంచి సుబ్బా బయటపడినప్పటికీ, లెఫ్టినెంట్ శశాంక్ తివారీ మాత్రం బలమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆయన్ని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 30 నిమిషాల తర్వాత, 800 మీటర్ల దూరంలో ఆయన మృతదేహాన్ని ఆర్మీ గుర్తించింది.
గురువారం ఈ ఘటన జరగ్గా.. లెఫ్టినెంట్ తివారీ పార్థివదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో సిలిగురిలోని బాగ్డోగ్రా విమానాశ్రయం నుంచి నేరుగా అయోధ్యకు తరలించారు. అయోధ్య విమానాశ్రయం నుంచి మిలటరీ అధికారులు మృతదేహాన్ని ఫైజాబాద్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారని, అక్కడ రాత్రంతా మృతదేహాన్ని ఉంచుతారని అయోధ్య నగర ఎస్పీ మధుబన్ సింగ్ తెలిపారు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లెఫ్టినెంట్ శశాంక్ తివారీ త్యాగానికి నివాళులర్పించి, ఆయన జ్ఞాపకార్థం అయోధ్యలో స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు.
శశాంక్ అంత్యక్రియలు శనివారం జమ్తారా ఘాట్లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.
చిన్నవయసులో, స్వల్పకాలం సేవలందించినప్పటికీ, రాబోయే తరాల సైనికులకు స్ఫూర్తినిచ్చే ధైర్యసాహసాలు, స్నేహ వారసత్వాన్ని మిగిల్చిన ధైర్యవంతుడు, నాయకుడిని కోల్పోయినందుకు ఆర్మీ సంతాపం వ్యక్తం చేస్తోందని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
అయోధ్య సిటీ మేజిస్ట్రేట్ రాజేష్ మిశ్రా మాట్లాడుతూ దివంగత లెఫ్టినెంట్ తివారీ తండ్రి జంగ్ బహదూర్ తివారీ మర్చంట్ నేవీలో పనిచేస్తూ, ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని తెలిపారు. అమెరికా నుంచి భారత్కు బయలుదేరిన ఆయన శనివారం ఉదయానికి చేరుకోనున్నారు.
లెఫ్టినెంట్ తివారీ చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండేవాడని అయని మేనమామ రాజేష్ దూబే పేర్కొన్నారు. ఫైజాబాద్ నగరంలోని ఓ సీబీఎస్ఈలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 2019లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఎన్డీఏకు ఎంపికయ్యారు. చిన్నప్పటి నుంచి దేశానికి సేవ చేయాలనే తపన ఆయనలో ఉండేది.
సంబంధిత కథనం