అణ్వాయుధాల బ్లాక్‌మెయిల్‌ను సహించం.. పాక్‌తో చర్చలు జరిగితే ఉగ్రవాదం, పీఓకేపైనే : ప్రధాని మోదీ-will not tolerate nuclear blackmail and discussion only on terrorism and pok pm narendra modi warning to pakistan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అణ్వాయుధాల బ్లాక్‌మెయిల్‌ను సహించం.. పాక్‌తో చర్చలు జరిగితే ఉగ్రవాదం, పీఓకేపైనే : ప్రధాని మోదీ

అణ్వాయుధాల బ్లాక్‌మెయిల్‌ను సహించం.. పాక్‌తో చర్చలు జరిగితే ఉగ్రవాదం, పీఓకేపైనే : ప్రధాని మోదీ

Anand Sai HT Telugu

పాకిస్థాన్‌పై భారతదేశం నిశితంగా నిఘా ఉంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్‌పై ప్రధాని మోదీ స్పందించారు.

ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ తర్వాత ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చారు. సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ రాబోయే రోజుల్లో కూడా పాకిస్థాన్‌పై భారత్ నిఘా ఉంచుతుందని అన్నారు. ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే తగిన సమాధానం ఉంటుందన్నారు. ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలు జరిగితే గుణపాఠం నేర్పిస్తామని ప్రధాని మోదీ అన్నారు. అణ్వాయుధాల పేరుతో బ్లాక్‌మెయిల్ చేయడాన్ని భారతదేశం సహించదని అన్నారు.

ఉగ్రవాద యుగం కూడా కాదు

'ఖచ్చితంగా ఇది యుద్ధ యుగం కాదు, అలాగే ఉగ్రవాద యుగం కూడా కాదు. పాకిస్థాన్‌ సరిహద్దులో దాడి చేయడానికి సిద్ధంగా ఉంది, కానీ భారతదేశం పాకిస్థాన్‌ ఛాతీపై దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ అనేది న్యాయమైన చర్య.' అని ప్రధాని మోదీ అన్నారు.

చర్చలు ఉగ్రవాదం, పీఓకేపైనే

నేటి పరిస్థితిలో ప్రపంచం యుద్ధాన్ని కోరుకోవడం లేదు, ఉగ్రవాదాన్ని కూడా కోరుకోవడం లేదన్నారు మోదీ. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తీసుకున్న చర్యను ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. పాకిస్థాన్‌ గుణం ఏంటో బహిర్గతమైందన్నారు. మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఐఎస్ఐ, పాకిస్థాన్‌ ఆర్మీ అధికారులు హాజరయ్యారని గుర్తు చేశారు. భారతదేశం ఏ విధమైన ఉగ్రవాదాన్ని సహించదని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు.

'పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే అది ఉగ్రవాదంపైనే ఉంటుంది, అది పీఓకే గురించే. ఉగ్రవాదం, చర్చలు కలిసి జరగవు. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి సాగలేవు, నీరు, రక్తం కూడా కలిసి ప్రవహించలేవు.' అని మోదీ వ్యాఖ్యానించారు.

పాక్ తప్పించుకునే ప్రయత్నాలు

ఆపరేషన్ సింధూర్‌లో భారత దళాల పరాక్రమానికి ప్రధాని మోదీ సెల్యూట్ చేశారు. పాకిస్థాన్‌‌తో చర్చలు జరిగితే అది ఉగ్రవాదంపైనే ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. మొదటి మూడు రోజుల్లోనే, భారతదేశం ఊహించని స్థాయిలో పాకిస్థాన్‌ను నాశనం చేసిందన్నారు. భారతదేశం దూకుడు చర్య తర్వాత పాకిస్థాన్‌ తప్పించుకోవడానికి మార్గాలను వెతకడం ప్రారంభించిందన్నారు. ఉద్రిక్తతను తగ్గించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తోందన్నారు. అందుకే మే 10 మధ్యాహ్నం పాకిస్థాన్‌ సైన్యం మన డీజీఎంఓను సంప్రదించిందని చెప్పారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.