పహల్గామ్ ఉగ్రదాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్ మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వినయ్ నర్వాల్ భార్య హిమాన్షిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో ముస్లింలు, కశ్మీరీలను ద్వేషించొద్దు అని ఆమె చెప్పడం ఇందుకు కారణం. ఆన్లైన్ ట్రోలింగ్ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ హిమాన్షికి మద్దతుగా నిలిచింది. తన సిద్ధాంతాలను వ్యక్తపరిచిన ఒక మహిళను ట్రోల్ చేయడం ఏ రూపంలోనూ ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది.
ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గామ్ సమీపంలో ఉన్న బైసారన్లో 26 మందిని బలిగొన్న ఉగ్రవాద దాడికి వారం రోజుల ముందు వినయ్ నర్వాల్- హిమాన్షి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ హనీమూన్కు కశ్మీర్ వెల్లగా.. ఉగ్రవాదులు నేవీ అధికారిపై కాల్పులు జరిపి చంపేశారు.
అనంతరం దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రేకెత్తాయి. ఉగ్రవాదులను, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్పై కఠినంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ ప్రభుత్వానికి సర్వత్రా విజ్ఞప్తులు అందుతున్నాయి.
కాగా ఉగ్రదాడి విషయంలో ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం సరికాదని హిమాన్షి అభిప్రాయపడ్డారు. ఈ విషయంపైనే గత గురువారం భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు.
“వినయ్ ఎక్కడున్నా ఆయన ప్రశాంతంగా ఉండాలని యావత్ దేశం ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. నాకు కావాల్సింది అదొక్కటే. అయితే ఎవరిపైనా ద్వేషం ఉండకూడదు. ముస్లింలు లేదా కశ్మీరీలపై ప్రజలు ద్వేషాన్ని చిమ్మడం నేను చూస్తున్నాను. ఇది మనకు అక్కర్లేదు. మనకు శాంతి కావాలి. శాంతి మాత్రమే కావాలి,” అని నేవీ ఆఫీసర్ భార్య హిమాన్షి అన్నారు.
హిమాన్షి వ్యాఖ్యల నేపథ్యంలో నేవీ అధికారి భార్యపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది.
ఈ ట్రోలింగ్ను గమనించిన ఎన్సీడబ్ల్యూ ఈ చర్యను ఖండించింది. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణం తర్వాత ఆయన భార్య హిమాన్షి నర్వాల్ను సోషల్ మీడియాలో టార్గెట్ చేసిన తీరు అత్యంత గర్హనీయమని, దురదృష్టకరమని పేర్కొంది.
ఒక మహిళను ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణ లేదా వ్యక్తిగత జీవితం ఆధారంగా ట్రోల్ చేయడం ఏ రూపంలోనూ ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది.
ఏదైనా అంగీకారం లేదా అసమ్మతిని వ్యక్తం చేయడం ఎల్లప్పుడూ "మర్యాదతో- రాజ్యాంగ హక్కులకు లోబడి" జరగాలని ప్యానెల్ సూచించింది. ప్రతి మహిళ గౌరవాన్ని కాపాడేందుకు జాతీయ మహిళా కమిషన్ కట్టుబడి ఉంది వివరించింది.
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో పలువురు పౌరులు మరణించడంపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) విచారం వ్యక్తం చేసింది. వినయ్ నర్వాల్తో పాటు ఇతరులను మతం గురించి అడిగి మరీ కాల్చడం అత్యంత దారుణమైన విషయం అని పేర్కొంది.
ఈ ఉగ్రదాడితో యావత్ దేశం బాధపడుతోందని ఎన్సీడబ్ల్యూ వెల్లడిచింది.
సంబంధిత కథనం