జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో సుమారు వారం క్రితం జరిగిన ఉగ్రదాడి రిపోర్టింగ్ లోబ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) మరోసారి తన వక్రబుద్ధిని చూపించుకుంది. దాంతో, భారత్ లో తీవ్ర విమర్శల పాలైంది. ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని బైసరన్ పచ్చిక మైదానంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించారు.
పహల్గామ్ దాడి విషయంలో బీబీసీ కవరేజ్ తీవ్ర విమర్శల పాలైంది. ఆ ఉగ్రదాడిని కవర్ చేయడంలో బీబీసీ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వం బీబీసీకి అధికారిక లేఖను జారీ చేసింది. ముఖ్యంగా ఉగ్రవాదులను మిలిటెంట్లుగా అభివర్ణించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అధికారులు హిందూస్తాన్ టైమ్స్ తో ధ్రువీకరించారు. మరోవైపు, బీబీసీ తీరుపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీబీసీని భారత్ లో నిషేధించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
పహల్గామ్ ఘటనపై బీబీసీ ఇండియా నెట్వర్క్ కవరేజ్ కు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) భారతదేశ మనోభావాలను బిబిసి ఇండియా హెడ్ జాకీ మార్టిన్ కు తెలియజేసిందని పిటిఐ వార్తా సంస్థ తెలిపింది. "ఉగ్రవాదులను మిలిటెంట్లుగా పేర్కొనడంపై బీబీసీకి కేంద్ర ప్రభుత్వం అధికారిక లేఖ పంపించింది. విదేశాంగ శాఖకు చెందిన ఎక్స్ టర్నల్ పబ్లిసిటీ విభాగం బీబీసీ రిపోర్టింగ్ ను, వారి సమాధానాన్ని పర్యవేక్షిస్తుంది’’ అని ఓ అధికారి తెలిపారు.
పహల్గామ్ దాడి తర్వాత భారత్, దాని సైన్యం, భద్రతా దళాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే, మతపరమైన సున్నితమైన, తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాప్తి చేశారనే ఆరోపణలపై భారత ప్రభుత్వం 16 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసిందని అధికారులు తెలిపారు. బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానళ్లు: డాన్ న్యూస్, ఇర్షాద్ భట్టి, సామా టీవీ, ఏఆర్వై న్యూస్, బీఓఎల్ న్యూస్, రఫ్తార్, ది పాకిస్తాన్ రిఫరెన్సింగ్, జియో న్యూస్, సామా స్పోర్ట్స్, జీఎన్ఎన్, ఉజైర్ క్రికెట్, ఉమర్ చీమా ఎక్స్క్లూజివ్, అస్మా షిరాజీ, మునీబ్ ఫరూక్, సునో న్యూస్, రజీ నామా.
పహల్గామ్ ఉగ్రవాద దాడి కవరేజ్ చుట్టూ నెలకొన్న ప్రస్తుత వివాదానికి ముందు.. 2023 లో కూడా బీబీసీ మరో వివాదాన్ని, విమర్శలను ఎదుర్కొంది. బీబీసీ రూపొందించిన 'ఇండియా: ది మోదీ క్వశ్చన్' డాక్యుమెంటరీకి సంబంధించిన వివాదమది. ఆ డాక్యుమెంటరీ ప్రధాని నరేంద్ర మోదీని, భారత న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉందంటూ గుజరాత్ కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ఆధారంగా బీబీసీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ డాక్యుమెంటరీ వివక్షాపూరితంగా ఉందని భారత్ లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
రెండు భాగాలుగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో 2002లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన గుజరాత్ అల్లర్ల గురించి చిత్రీకరించారు. మొదటి భాగం 2023 జనవరి 18న, రెండో భాగం 2023 జనవరి 24న బీబీసీ వెబ్సైట్లో ప్రసారమైంది. బ్రిటన్ జాతీయ బ్రాడ్ కాస్టర్ అయిన బీబీసీ ఈ డాక్యుమెంటరీని సమర్థించింది. ఇది "అత్యున్నత సంపాదకీయ ప్రమాణాల ప్రకారం రూపొందించబడిందని పేర్కొంది. అయితే భారత ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీని "వలసవాద మనస్తత్వం" యొక్క ఉత్పత్తి అని తోసిపుచ్చింది.
ఆ ఏడాది జనవరిలో బీజేపీ ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీని తొలగించాలని వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ను, సంబంధిత పోస్టులను తొలగించాలని ట్విటర్ ను ఆదేశించింది. భారత్ లో బీబీసీని నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ, ఇతర నగరాల్లోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ నిర్వహించిన మూడు రోజుల సర్వేలో వెల్లడైన పలు అవకతవకల ఆధారంగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) 2023 ఏప్రిల్లో బీబీసీ ఇండియాపై ఫెమా దర్యాప్తు ప్రారంభించింది.
సంబంధిత కథనం