CJI Justice DY Chandrachud at HTLS 2022: ఇటీవల సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్ హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2022(Hindustan Times Leadership Summit 2022)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ లో మహిళా న్యాయమూర్తులు(women judges) ఎందుకు ఎక్కువగా లేరని, అలాగే, అణగారిన వర్గాల నుంచి న్యాయవ్యవస్థలో ప్రాతినిధ్యం ఎందుకు చాలా తక్కువగా ఉంది? అన్న ప్రశ్నలకు జస్టిస్ చంద్రచూడ్ సమాధానమిచ్చారు. న్యాయవాద వృత్తి (Legal profession) ఇప్పటికీ, ఫ్యూడల్, పితృస్వామ్యిక విధానంలోనే ఉందని, మహిళలను ఈ వ్యవస్థలో అంగీకరించడం లేదని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. ‘‘సుప్రీంకోర్టు న్యాయమూర్తులను హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టులో ప్రాక్టిస్ చేస్తున్న లాయర్ల నుంచి ఎంపిక చేస్తారు. అలాగే, హైకోర్టులో న్యాయమూర్తులను అక్కడి కింది కోర్టుల్లోని జడ్జీలు, హైకోర్టు సీనియర్ జడ్జీల నుంచి ఎంపిక చేస్తారు. అందువల్ల కింది స్థాయి జ్యుడీషియరీలో సరైన ప్రాతినిధ్యం ఉంటేనే, పై స్థాయిలో ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ ఎంపిక ప్రక్రియ ప్రాతిపదికలోనే మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం న్యాయవాద వృత్తి ఇప్పటికీ, ఫ్యూడల్, పితృస్వామ్యిక విధానంలోనే ఉండడం’’ అని జస్టిస్ చంద్రచూడ్ విశదీకరించారు.
ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళలు(Women in judiciary) ఉండాలని, వారు ఉండడం వల్ల కేసులను అర్థం చేసుకోవడంలో ఒక ప్రత్యేక దృక్పథం ఏర్పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా న్యాయమూర్తి జస్టిస్ రంజన దేశాయితో పని చేసిన అనుభవాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్ పంచుకున్నారు. మహిళలు ఈ వృత్తని ఎన్నుకోకపోవడానికి సామాజిక, ఆర్థిక కారణాలు చాలా ఉంటాయన్నారు. ముఖ్యంగా మహిళలకు అవసరమైన మౌలిక వసతులు చాలా కోర్టుల్లో లేవన్నారు. మహిళలకు ప్రత్యేకంగా టాయలెట్లు లేని కోర్టులు కూడా ఉన్నాయన్నారు.