Bengaluru CEO kills her son: ‘‘భర్తకు కొడుకును ఇవ్వడం ఇష్టం లేకనే..’’ - ఆ దారుణానికి ఒడిగట్టిన బెంగళూరు స్టార్టప్ సీఈఓ
Bengaluru CEO kills her son: తన 4 ఏళ్ల కుమారుడిని హత్య చేసిన ఆరోపణలపై అరెస్టు అయిన బెంగళూరు స్టార్టప్ కంపెనీ సీఈఓ సుచనా సేథ్.. ఆ నేరానికి తాను పాల్పడలేదనే చెబుతోంది. కానీ, ఆమె వాదనను పోలీసులు విశ్వసించడం లేదు.
Bengaluru CEO kills her son: తన 4 ఏళ్ల కుమారుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ (Suchana Seth) కేసులో పోలీసులు మరిన్ని వివరాలను సేకరించారు. భర్తతో విబేధాల కారణంగానే, ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
చంపలేదనే వాదన..
గోవాలోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లో తన 4 ఏళ్ల కుమారుడిని హత్య చేసి, మృతదేహాన్ని ఒక సూట్ కేసులో కుక్కి, టాక్సీలో బెంగళూరుకు బయల్దేరిన బెంగళూరు స్టార్టప్ సీఈఓ (Bengaluru CEO Suchana Seth) సుచనా సేథ్ ను సోమవారం రాత్రి, నాటకీయంగా చిత్రదుర్గలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత, మరుసటి రోజు ఆమెను మళ్లీ గోవాకు తీసుకువచ్చారు. కోర్టు ఆమెకు ఆరు రోజుల పోలీసు కస్టడీని ఆదేశించింది. అయితే, పోలీసుల విచారణలో ఆమె తన తప్పును ఒప్పుకోవడం లేదు. తాను నిద్ర లేచే సమయానికే తన కుమారుడు చనిపోయి ఉన్నాడని వాదిస్తోంది. దాంతో, హత్య వెనుక ఉద్దేశ్యంపై అధికారులు ఇంకా నిర్ధారణకు రాలేదు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, సుచనా సేథ్ AI ఎథిక్స్ నిపుణురాలు, డేటా సైంటిస్ట్, డేటా సైన్స్ టీమ్లను మెంటారింగ్ చేయడంలో, స్కేలింగ్ మెషిన్ లెర్నింగ్ సొల్యూషన్స్లో 12 సంవత్సరాల అనుభవం ఉంది.
కోర్టు తీర్పుతో అసంతృప్తి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుచనా సేథ్ కు తన భర్తతో విబేధాలు ఉన్నాయి. వారి విడాకుల పిటిషన్ కోర్టులో తుది దశలో ఉంది. వారి కుమారుడిని ప్రతీ ఆదివారం తన తండ్రికి ఇవ్వాలని ఇటీవల కోర్టు ఆమెను ఆదేశించింది. ఆ ఆదేశాలపై ఆమె తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆమె తన కుమారుడిని తీసుకుని గోవా వెళ్లారని, అక్కడ సర్వీస్ అపార్ట్మెంట్లో తన కుమారుడిని హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.
2010 లో వివాహం..
సుచనా సేథ్ కు 2010లో వివాహమైంది. 9 ఏళ్ల తరువాత వారికి ఒక కుమారుడు కలిగాడు. పెళ్లైన నాటి నుంచి వారి మధ్య విబేధాలు ఉన్నాయి. 2022 లో వారు విడాకులకు అప్లై చేశారు. కాగా, తన భర్త తనను శారీరకంగా, మానసికంగా హింసించేవాడని సుచనా సేథ్ ఆరోపిస్తున్నారు. తనను తీవ్రంగా కొట్టేవాడని చెప్పారు. తన ఆరోపణలకు బలం చేకూర్చే ఆసుపత్రి పత్రాలను, వాట్సాప్ చాట్ లను ఆమె కోర్టు కు అందించినట్లు సమాచారం. అలాగే, తన భర్త వార్షికాదాయం కోటి రూపాయలకు పైగా ఉండడంతో నెలకు రూ.2.5 లక్షల భరణం కూడా ఇవ్వాలని కూడా ఆమె కోర్టును కోరారు.
ఖాళీ కాఫ్ సిరప్ లు..
తన కుమారుడితో పాటు ఆమె ఉన్న గోవా అపార్ట్మెంట్లో రెండు ఖాళీ దగ్గు సిరప్ సీసాలను పోలీసులు గుర్తించారు. ముందుగా ప్రణాళిక ప్రకారమే అధిక డోస్ లో దగ్గు మందు ఇచ్చి, ఆ తరువాత ఆ మత్తులో నిద్రపోతున్న కుమారుడిని దిండుతో ముఖంపై అదిమి హత్య చేసిందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మానసిక స్థితిని అంచనా వేయడానికి సేథ్కు మానసిక పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.